చైనా కంపెనీల మనీలాండరింగ్ రాకెట్

12 Aug, 2020 13:06 IST|Sakshi

చైనీయుల  హవాలా లావాదేవీలు,  ఐటీ దాడులు

1000 కోట్ల  రూపాయల మనీలాండరింగ్‌ 

షెల్ కంపెనీల ద్వారా  అక్రమాలు 

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా విస్తరణ, ఇండో చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఒకవైపు చైనాపై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుండగా మరోవైపు చైనా కంపెనీల భారీ హవాలా రాకెట్‌ను ఆదాయ పన్ను శాఖ ఛేదించింది. 1,000 కోట్ల రూపాయలు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్న చైనీయులు, ఢిల్లీలోని సంబంధిత భారతీయ వ్యక్తులపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సోదాలు నిర్వహించింది. షెల్ కంపెనీల ద్వారా భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఈ సోదాలు జరిపినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)తెలిపింది. వివిధ బ్యాంకుల్లో 40కి పైగా అకౌంట్ల ద్వారా హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు సీబీడీటీ అధికార ప్రతినిధి సురభి అహ్లువాలియా ఒక ప్రకటనలో తెలిపారు.

చైనా అనుబంధ సంస్థల ద్వారా భారత్‌లో రిటైల్‌ షోరూమ్‌ల బిజినెస్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నించిందనీ, నకిలీ కంపెనీలు, స్థానిక భాగస్వామ్యంతో వెయ్యి కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డట్టు తేలిందని  పేర్కొంది. దీనికి సంబంధించిన పత్రాలను, హాంకాంగ్, యుఎస్ డాలర్లతో సంబంధం ఉన్న విదేశీ హవాలా లావాదేవీల సాక్ష్యాలను కూడా వెలికి తీసినట్టు ఐటీ విభాగం వెల్లడించింది. బ్యాంకు ఉద్యోగులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సహకారంతో ఈ  అక్రమాలకు తెగబడినట్టు పేర్కొంది. 

మరిన్ని వార్తలు