కలిసొచ్చిన రష్యా-ఉక్రెయిన్‌ వార్‌..! తొలిసారి టాప్‌-5 క్లబ్‌లోకి భారత్‌..!

25 Mar, 2022 13:51 IST|Sakshi

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం యూరప్‌దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యూరప్‌ ఎక్సేఛేంజ్‌లు నేల చూపులు చూస్తున్నాయి. ఇప్పుడిదే భారత్‌కు కలిసొచ్చింది. భారత స్టాక్‌ మార్కెట్స్‌ కొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తున్నాయి. 

టాప్‌-5 క్లబ్‌లోకి..!
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంతో భారత మార్కెట్‌కు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతోంది. యూరప్‌ దేశాల మార్కెట్స్‌ తీవ్రంగా పతనమవ్వడంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విషయంలో తొలిసారిగా భారత్‌ టాప్‌-5 క్లబ్‌లోకి చేరింది.  తాజాగా భారత్‌ మార్కెట్‌ క్యాప్‌ 3.21 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుని రికార్డులను క్రియేట్‌ చేసింది. యూకే మార్కెట్‌ క్యాప్‌ 3.19 ట్రిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా భారత మార్కెట్లు నమోదుచేశాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌ క్యాప్‌ ఐదో స్థానంలోకి చేరుకుంది. 

అమెరికా నంబర్‌ 1..!
మార్కెట్‌ క్యాప్‌ విషయంలో నంబర్‌ 1 స్థానంలో అమెరికా(47.32 ట్రిలియన్‌ డాలర్లు)నే కొనసాగుతుంది. రెండో స్థానంలో చైనా(11.52 ట్రిలియన్‌ డాలర్లు)తో, మూడో స్థానంలో జపాన్‌(6.00 ట్రిలియన్‌ డాలర్లు)తో, నాలుగో స్థానంలో హాంగ్‌ కాంగ్‌ మార్కెట్లు (5.55 ట్రిలియన్‌ డాలర్ల)తో కొనసాగుతున్నాయి. 

పడిలేచిన కెరటంలా..!
2022 ప్రారంభంలో భారత మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇక రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో మార్కెట్లు బేర్‌ మంటూ నేల చూపులు చూశాయి. మార్కెట్ క్యాప్‌లో 7.4 శాతం పడిపోయినప్పటికీ, తిరిగి మార్కెట్స్‌ పుంజుకున్నాయి. మార్కెట్‌ క్యాప్‌ విషయంలో రెండు స్థానాలు ఎగబాకింది.  భారత మార్కెట్స్‌ సౌదీ అరేబియా (3.18 ట్రిలియన్ డాలర్లు),కెనడా (3.18 ట్రిలియన్ డాలర్ల) కంటే ఎక్కువ మార్కెట్‌ క్యాప్‌ను కల్గి ఉన్నాయి. టాప్‌ -5 స్థానంలో ఉండే జర్మనీ మార్కెట్లు పదో స్థానానికి పడిపోయాయి. 

చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌..! ఇన్ఫోసిస్‌  నారాయణమూర్తి అల్లుడికి చిక్కులు..!

మరిన్ని వార్తలు