ఇండియా సిమెంట్స్‌ నష్టాలు పెరిగాయ్‌, ఆస్తుల అమ్మకానికి ప్లాన్స్‌

25 May, 2023 15:01 IST|Sakshi

క్యూ4లో రూ. 218 కోట్లు 

చెన్నై: ప్రయివేట్‌ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి(క్యూ4)లో స్టాండెలోన్‌ నికర నష్టం పెరిగి రూ. 218 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 24 కోట్ల నష్టం నమోదైంది. ఇంధనం, విద్యుత్‌ వ్యయాలు భారీగా పెరగడం లాభాలను దెబ్బతీసింది.

మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,397 కోట్ల నుంచి రూ. 1,479 కోట్లకు ఎగసింది. పెట్టుబడి నష్టాలు, రైటాఫ్‌లను నమోదు చేయడంతో క్యూ4 ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 189 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2021–22లో రూ. 39 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 4,730 కోట్ల నుంచి రూ. 5,415 కోట్లకు జంప్‌ చేసింది. కాగా.. గతేడాది క్యూ1లో రూ. 76 కోట్ల లాభం, క్యూ2లో రూ. 138 కోట్ల నష్టం, క్యూ3లో రూ. 91 కోట్ల లాభం ప్రకటించడంతో పూర్తి ఏడాదికి రూ. 218 కోట్ల నష్టం నమోదైనట్లు కంపెనీ వివరించింది. క్యూ3లో ఆస్తుల విక్రయం ద్వారా రూ. 294 కోట్లు ఆర్జించడంతో లాభాలు ప్రకటించినట్లు వెల్లడించింది. 

ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్‌ వీడియో 

ఆస్తుల మానిటైజేషన్‌ 
తమిళనాడులోని ఆస్తుల మానిటైజేషన్‌ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు ఇండియా సిమెంట్స్‌ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్‌.శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ఆసక్తిగల పార్టీలతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. కంపెనీకిగల మొత్తం 26,000 ఎకరాలలో 1,000 ఎకరాల భూమిని మానిటైజ్‌ చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా మొత్తం రూ. 500 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకోనున్నట్లు వివరించారు. కంపెనీకి మొత్తం రూ. 2,900 కోట్ల రుణాలున్నట్లు వెల్లడించారు.  (విప్రో చైర్మన్‌ కీలక నిర్ణయం, సగం జీతం కట్‌)

డోంట్‌ మిస్‌ టూ క్లిక్‌ హియర్‌: సాక్షిబిజినెస్‌

మరిన్ని వార్తలు