ద్రవ్యలోటు 12.3 శాతానికి అప్‌!

1 Jul, 2022 09:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు మే నెలనాటికి ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో 12.3 శాతానికి చేరింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ద్రవ్యలోటు లక్ష్యం రూ.16,61,196 కోట్లు.

స్థూల దేశీయోత్పత్తి అంచనాలతో పోల్చితే ఇది 6.4 శాతం. అయితే మే ముగిసే నాటికి ద్రవ్యలోటు విలువ రూ.2,03,921 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు లక్ష్యంలో 8.2 శాతం వద్దే ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ వ్యయాల పెరుగుదలతో ద్రవ్యలోటు లక్ష్యంలో 12.3 శాతానికి పెరిగినట్లు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 

మే నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.3.81 లక్షల కోట్లు. బడ్జెట్‌ మొత్తం అంచనాల్లో వసూళ్లు 16.7 శాతానికి చేరాయి. 

ఇక వ్యయాలు ఇదే కాలంలో రూ.5.85 లక్షల కోట్లు. బడ్జెట్‌ మొత్తం అంచనాల్లో ఇది 14.8 శాతానికి చేరాయి.  

వెరసి ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు. అంటే ద్రవ్యలోటు 2.3 లక్షల కోట్లన్నమాట.  

పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. పెట్రో డీజిల్‌ ధరల తగ్గింపు వల్ల కేంద్రం ఏడాదికి రూ. లక్ష కోట్లు కోల్పోతుందని
అంచనా. 

ఆహార, ఎరువులు సబ్సిడీలు, ఆర్‌బీఐ నుంచి భారీ డివిడెండ్‌ రాకపోవడం వంటి అంశాలు ద్రవ్యలోటును లక్ష్యానికి పెంచే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు