‘గివింగ్‌పీఐ’: దానకర్ణులు ఒక్కటయ్యారు..లక్ష కోట్లు విరాళం ఖాయం!

20 Jul, 2022 07:01 IST|Sakshi

ముంబై: దాతల కుటుంబాలు చేతులు కలిపాయి. విప్రో ప్రేమ్‌జీ, జిరోదా నిఖిల్‌ కామత్, రోహిణి నీలేకని, నిసా గోద్రెజ్‌ సంయుక్తంగా ‘గివింగ్‌పీఐ’ పేరుతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 2030 నాటికి ఏటా బిలియన్‌ డాలర్లను సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన (ఎస్‌డీజీ) కోసం సమీకరించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 

ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగమయ్యే ప్రతీ సభ్యుడు/సభ్యురాలు ఏటా కనీసం రూ.50 లక్షలను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 2030 నాటికి 5,000 మంది సభ్యుల స్థాయికి నెట్‌వర్క్‌ను విస్తరించాలని వీరు నిర్ణయించారు. అదితి, రిషబ్‌ ప్రేమ్‌జీ, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్, మనీషా, ఆశిష్‌ ధావన్, నిఖిల్‌ కామత్, నిసా గోద్రెజ్, రాజన్‌ నవాని, రోహిణి నీలేకని, స్కోల్‌ ఫౌండేషన్, టెరా సింగ్, వచాని, వాసవి భారత్‌ రామ్, వివేక్‌జైన్‌ ఈ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు చేతులు కలిపిన వారిలో ఉన్నారు. 

భారత్‌లో 113 మంది బిలియనీర్లు, 6,884 అధిక ధనవంతులు ఉన్నారు. వీరి సంఖ్య వచ్చే ఐదేళ్లలో 12,000కు చేరుకుంటుందని బెయిన్‌ అండ్‌ కంపెనీ నివేదిక చెబుతోంది. అంతర్జాతీయంగా ఉన్న తోటివారిని వీరు స్ఫూర్తిగా తీసుకుని కుటుంబ దాతృత్వానికి ముందుకు వస్తే భారత్‌లో అదనంగా రూ.60,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు సమకూరతాయని అంచనా.   

మరిన్ని వార్తలు