రెండంకెల వృద్ధికి చేరువలో భారత్‌

14 Oct, 2021 06:14 IST|Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్లో ప్రసంగం  

బోస్టన్‌: భారత్‌ ఈ ఏడాది రెండంకెల వృద్ధికి చేరువలో ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. తద్వారా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీలో మొదటి స్థానంలో నిలవనుందని వివరించారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆర్థికమంత్రి చేసిన ప్రసంగంలో కొన్ని కీలక అంశాలు..

► వచ్చే ఏడాది ఆర్థికాభివృద్ధి 7.5–8.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ఇది రాబోయే దశాబ్దానికి నిలకడగా ఉంటుంది.  
► వృద్ధి అంచనాలపై భారత్‌ ఆర్థిక శాఖ ఇంకా ఎటువంటి అభిప్రాయానికీ రాలేదు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), రేటింగ్‌ ఏజెన్సీలు మాత్రం భారత్‌ వృద్ధి రేటు రెండంకెలకు చేరువలోనే ఉంటాయని అంచనావేస్తున్నాయి.  
► భారత్‌లో అన్ని కీలక విభాగాలూ మంచి పురోగతిని సాధిస్తున్నాయి. పరిశ్రమల వృద్ధి తీరు బాగుంది. సేవల రంగం మంచి ఫలితాలను అందిస్తోంది. రాబోయే దశాబ్దాలలో భారతదేశం వృద్ధి తీరు వెనుకబడి ఉంటుందనడానికి నాకు ఒక కారణం కనిపించడం లేదు.  
► మీరు మొత్తం ప్రపంచం విషయంలో ఒకే ఆలోచనను కలిగి ఉంటారని నేను అనుకోను. అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలు వేగంగా కోలుకునే అవకాశం ఉంది. వేగవంతమైన వృద్ధి పథాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఆయా దేశాలు బహుశా వృద్ధికి చోదక శక్తిగా కూ డా ఉండే అవకాశం ఉంది. ఆయా దేశాలే ప్రపం చ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాయి.  
► గణాంకాలను పరిశీలిస్తే,  ఈ సంవత్సరం భారతదేశ వృద్ధి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుందని నేను చెప్పగలను.  అయితే ఇక్కడ లో బేస్‌ ఎఫెక్ట్‌ ప్రభావం కూడా ఉండివుండవచ్చు.  కానీ వృద్ధి స్పీడ్‌ వచ్చే యేడాది కూడా కొనసాగుతుంది. 2022 లో కూడా మా దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది.
► అభివృద్ధి చెందిన దేశాలు కూడా చక్కటి పురోగతి సాధిస్తున్నాయి. కానీ హై బేస్‌ వల్ల ఆయా దేశాల పురోగతి రెండంకెలకి దగ్గరగా ఉండదు.  ప్రపంచ వృద్ధికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా తోడ్పడతాయి.  
► ప్రపంచ పరిస్థితి ప్రస్తుతం మారిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న వృద్ధి తీరును కరోనా మహమ్మారికి ముందు పరిస్థితితో పోల్చి చూడడం సరికాదన్నది నా అభిప్రాయం.  
► ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల పరిస్థితిని చూసినప్పుడు ప్రస్తుతం ఒక విషయం అర్థం అవుతోంది.  దేశాలు తమ వృద్ధి ప్రణాళికలను మునుపటి కంటే (కరోనా ముందు) చాలా భిన్నంగా రూపొందించుకుంటున్నాయి. దీనికి మహమ్మారి విసిరిన సవాళ్లు ప్రధాన కారణం.  
► మారిన ప్రపంచ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులకు అనుకూలమైన దేశాలపై దృష్టి సారిస్తున్నారు. చట్టబద్దమైన పాలన, ప్రజాస్వామ్యం, పారదర్శక విధానాలు, మీరు విస్తృత ప్రపంచ చట్రంతో ఉన్నారని బయటి వ్యక్తి కాదని ఒక దేశంలో పెట్టుబడిదారుకు లభిస్తున్న హామీ, అంతర్జాతీయంగా అనుసంధానమైన నియమ నిబంధనలు.. ఇవన్నీ ప్రపంచ పెట్టుబడిదారులకు అవసరం. భారతదేశంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి,  పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడానికి ఇవన్నీ అదనపు కారణాలు.  
► భారీ మార్కెట్‌ను కలిగి ఉండడం, వినియోగ డిమాండ్‌ను కలిగి ఉండడం భారత్‌కు ఉన్న అదనపు ఆర్థిక బలం.  
► యువత అధికంగా ఉండడం భారత్‌కు కలిసి వస్తున్న మరో అంశం. వివిధ రంగాల్లో యువత మంచి నైపుణ్యతను కలిగి ఉంది.   దేశం గొప్ప కొనుగోలు శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు వినియోగ శక్తికి కలిగి ఉన్నారు. ఇతర దేశాల నుంచి తమ పెట్టుబడులను తరలించాలనకునే పెట్టుబడిదారులకు భారత్‌ ఒక చక్కటి గమ్య స్థానంగా ఉంటుంది.   
► ఇక వ్యవసాయ రంగంలోనూ భారత్‌ పురోగమిస్తోంది. పలు దేశాలకు భారత్‌ నుంచి ఆహారోత్పత్తుల ఎగుమతి జరుగుతోంది. ఆహారం, ఫుడ్‌ ఫ్రాసెస్డ్‌ మెటీరియల్స్‌ ఎగుమతులకు సంబంధించి ప్రధాన దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంది.   
► జౌళి, పాదరక్షలు, తోళ్ల పరిశ్రమలుసహా తయారీ రంగంలోని పలు విభాగాల్లో నైపుణ్యత కలిగిన వ్యక్తులు పనిచేస్తున్నారు. ఆయా అంశాల నేపథ్యంలో వచ్చే దశాబ్ద కాలంలో భా రత్‌ సగటున 7.5 శాతం నుంచి 8.5 శాతం వృద్ధి నమోదుచేస్తుందన్న విశ్వాసం నాకు ఉంది.

విశిష్ట లక్షణాలు భారత్‌ సొంతం
పెట్టుబడులకు సంబంధించి ఏ ఒక్క దేశంలోనూ లేని అన్ని విశిష్ట లక్షణాలు భారత్‌కు ఉన్నాయి.  ఒక దేశంలో కొన్ని సానుకూల అంశాలు... మరొక దేశంలో మరికొన్ని సానుకూల అంశాలు ఉండవచ్చు. కానీ భారతదేశంలో అన్నీ సానుకూల అంశాలే ఉన్నాయి.         
– ఆర్థికమంత్రి

మరిన్ని వార్తలు