విధాన స్థిరత్వం, పారదర్శకత బాటన భారత్‌

4 Nov, 2022 04:51 IST|Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  

న్యూఢిల్లీ: దేశంలో పెట్టుబడులను పురోభివృద్దికి పాలసీ స్థిరత్వం, పారదర్శకత, చక్కటి సంప్రదింపుల ప్రక్రియ బాటను అందిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పేర్కొన్నారు.  దేశంలో ఇంధన వనరుల రంగంలో అవకాశాలు అపారమన్న ఆమె, ఈ అవకాశాలను అందిపుచ్చుకోడానికి పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు అమ్మకానికి సంబంధించి ఆరవ విడత గనుల వేలం పక్రియ ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు.

‘ఈ అమృత్‌ కాలం (భారత్‌ స్వాతంత్రం సముపార్జించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా) సమయంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సమయంలో  భారతదేశానికి అన్ని ప్రాథమిక ఖనిజాలు అవసరం. ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలు అపారం’ అని ఆర్థికమంత్రి ఈ సందర్బంగా పేర్కొన్నారు. పెట్టుబడులకు తగిన దేశం భారత్‌ అని మోర్గాన్‌ స్టాన్లీ చేసిన వ్యాఖ్యను ఆర్థికమంత్రి ప్రస్తావించారు. 

బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ వాణిజ్య గనుల ఆరవ విడత వేలంలో 141 బొగ్గు, లిగ్నైట్‌ గనులను విక్రయించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 67 బొగ్గు గనులను కమర్షియల్‌ మైనింగ్‌ కింద అమ్మకానికి ఉంచినట్లు కూడా తెలిపారు. ప్రపంచంలో పలు దేశాలు మందగమనం ముందు నుంచొన్న సమయంలో భారత్‌ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని తెలిపారు.  
ఆరవ విడత బొగ్గు గనుల వేలం పక్రియను ప్రారంభిస్తున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  

మరిన్ని వార్తలు