పీసీ మార్కెట్‌ 30 శాతం డౌన్‌

27 May, 2023 05:15 IST|Sakshi

జనవరి–మార్చి కాలంలో 29.92 లక్షల యూనిట్లు

ఐడీసీ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) రవాణా (షిప్‌మెంట్‌/విక్రేతలకు సరఫరా) జనవరి–మార్చి త్రైమాసికంలో 29.92 లక్షల యూనిట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో షిప్‌మెంట్‌తో పోల్చి చూసినప్పుడు 30 శాతం తగ్గిపోయింది. ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికం పీసీ షిప్‌మెంట్‌ వివరాలను విడుదల చేసింది. 2022 ఏడాది మొదటి మూడు నెలల్లో మన దేశ మార్కెట్లో పీసీల షిప్‌మెంట్‌ 42.82 లక్షల యూనిట్లుగా ఉంది. మార్చి త్రైమాసికంలో డెస్క్‌టాప్‌లకు డిమాండ్‌ ఉందని, నోట్‌బుక్‌ల డిమాండ్‌ మరో విడత బలహీనంగా నమోదై, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు 41 శాతం తగ్గినట్టు ఐడీసీ నివేదిక తెలిపింది. వినియోగ డిమాండ్‌ 36.1 శాతం తగ్గితే, వాణిజ్య డిమాండ్‌ 25.1 శాతం తగ్గింది.

అగ్రస్థానంలోనే హెచ్‌పీ కంపెనీ
హెచ్‌పీ కంపెనీ 33.8 శాతం వాటాను పీసీ మార్కె ట్లో కలిగి ఉంది. ఈ కంపెనీ పీసీల రవాణా మార్చి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 30.2 శాతం తగ్గింది. లెనోవో చేతిలో 15.7 శాతం వాటా ఉంది. లెనోవో పీసీ షిప్‌మెంట్‌ మార్చి త్రైమాసికంలో 37.5 శాతం క్షీణించి 4.72 లక్షల యూనిట్లుగా ఉంది. డెల్‌ మార్కెట్‌ వాటా 19.4 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గింది. 4.17 లక్షల పీసీలను షిప్‌ చేసింది. ఏసర్‌ గ్రూప్‌ వాటా 12.3 శా తంగా, ఆసుస్‌ మార్కెట్‌ వాటా 6.6 శాతం చొప్పున ఉంది.   

మరిన్ని వార్తలు