దేశంలో భారీగా పెరిగిన ఆదాయ అసమానతలు

7 Dec, 2021 18:05 IST|Sakshi

India Is Poor and Very Unequal With Affluent Elite: దేశంలో రోజురోజుకీ ఆదాయ అసమానతలు భారీగా పెరిగిపోతున్నాయి. ధనిక ప్రజలు మరింత ధనవంతులు అవుతుంటే.. పేద ప్రజలు ఇంకా పేదరికంలో జారుకుంటున్నారు. 2021 జాతీయ ఆదాయంలో ఐదో వంతు కేవలం ఒక శాతం మంది దగ్గరే ఉన్నట్లు ప్రపంచ అసమానత నివేదిక తెలిపింది. భారత్‌లో ఆదాయపరమైన అసమానతలు భారీగా పెరిగిపోతున్నట్లు వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ నివేదిక వెల్లడించింది. 2021లో మొత్తం జాతీయ ఆదాయంలో ఒక శాతం ధనవంతులైన భారతీయుల వద్ద 22 శాతం సంపద కలిగి ఉన్నారని ఈ నివేదిక తెలిపింది. ఇక ధనవంతుల జాబితాలో ఉన్న తొలి 10 శాతం మంది చేతిలో 57 శాతం ఆదాయం ఉన్నట్లు పేర్కొంది. 

సంపదలోనూ అసమానతలు
భారత దేశంలో వయోజనుల సగటు ఆదాయం ఏడాదికి రూ.2,04,200 అని నివేదిక తెలిపింది. సంపదలోనూ అసమానతలు తీవ్రంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. సంపద విషయంలో కిందనున్న 50 శాతం కుటుంబాల వద్ద అసలేమీ సంపద లేదని పేర్కొంది. మధ్య తరగతి వారి వద్ద 29.5 శాతం సంపద ఉందని వెల్లడించింది. అదే పైన ఉన్న 10 శాతం మంది వద్ద 65 శాతం, 1 శాతం మంది దగ్గర 33 శాతం సంపద ఉన్నట్లు తెలిపింది. మధ్యతరగతి వారి వద్ద సగటున రూ.7,23,930ల సంపద ఉన్నట్లు నివేదించింది. అదే పైన ఉన్న 10 శాతం మంది దగ్గర సగటున రూ.63,54,070, ఒక శాతం మంది వద్ద రూ.3,24,49,360 సంపద ఉన్నట్లు తెలిపింది. 

(చదవండి: ఫేస్‌బుక్‌కు భారీ షాక్‌.. 10 లక్షల కోట్లకు దావా!)

లింగ అసమానతలు
1985 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆదాయ, సంపద విషయంలో అసమానతల్ని పెంచాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పైన ఉన్న ఒక శాతం మంది ఆర్థిక సంస్కరణల వల్ల భారీ లబ్ధి పొందారని తెలిపింది. తక్కువ, మధ్య ఆదాయ సమూహాల మధ్య వృద్ధి సాపేక్షంగా ఉన్నట్లు పేర్కొంది. 1985 తర్వాత నుంచి నేటికి పేదరికం పెరుగుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. అలాగే, దేశంలో లింగ అసమానతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మహిళా కార్మిక ఆదాయ వాటా కేవలం 18 శాతం అని తెలిపింది. ఆసియాలో చైనా మినహా మహిళా కార్మిక ఆదాయ వాటా 21 శాతం కంటే తక్కువ ఉన్నట్లు తెలిపింది. 

(చదవండి: మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎవరు చూశారో తెలుసుకోండి ఇలా..?)

మరిన్ని వార్తలు