సానుకూలంగా రియల్టీ సెంటిమెంట్‌

28 Jan, 2021 16:30 IST|Sakshi

నైట్‌ఫ్రాంక్‌–ఫిక్కీ–నరెడ్కో సర్వేలో వెల్లడి 

న్యూఢిల్లీ: గతేడాది అక్టోబర్‌–డిసెంబర్‌ నాల్గో త్రైమాసికం (క్యూ4)లో దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సెంటిమెంట్‌ సానుకూలంగా మారింది. దీంతో వచ్చే ఆరు నెలల కాలంలో నివాస, కార్యాలయాల విభాగంలో డిమాండ్‌ పుంజుకుంటుందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా–ఫిక్కీ–నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన ‘27వ రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ ఇండెక్స్‌–క్యూ4, 2020’ సర్వే వెల్లడించింది. తొలిసారిగా 2020 క్యూ4లో కరెంట్‌ సెంటిమెంట్‌ స్కోర్‌ 54 పాయింట్స్‌తో ఆశావాద జోన్‌ (ఆప్టిమిస్టిక్‌)లోకి చేరిందని సర్వే తెలిపింది. క్యూ3తో పోలిస్తే 14 పాయింట్లు పెరిగింది.

ఇక క్యూ4లో ఫ్యూచర్‌ సెంటిమెంట్‌ స్కోర్‌ 65 పాయింట్లకు ఎగబాకింది. క్యూ3లో ఇది 52 పాయింట్లుగా ఉంది. స్కోర్‌ 50 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే ఆశావాద జోన్, 50 పాయింట్లుగా ఉంటే న్యూట్రల్, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద (పెసిమిజం) జోన్‌గా పరిగణిస్తుంటారు. సానుకూల దృక్పథంతో మొదలైన కొత్త ఏడాదితో రాబోయే ఆరు నెలల్లో గృహాల అమ్మకాలు 77 శాతం మేర పెరుగుతాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌ అండ్‌ ఎండీ శిశీర్‌ బైజాల్‌ తెలిపారు. క్యూ3లో ఇది 66 శాతంగా ఉంది. క్యూ3లో 47 శాతంగా ఉన్న ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ లావాదేవీలు క్యూ4 నాటికి 60 శాతానికి పెరిగాయి. 

చదవండి:
రియల్‌ ఎస్టేట్‌ మళ్లీ జోరందుకుంది

పెరిగిన హౌసింగ్‌ సేల్స్‌.. కారణాలు ఇవే!

మరిన్ని వార్తలు