కరెంట్‌ అకౌంట్‌ మిగులు @ 20 బిలియన్‌ డాలర్లు

1 Oct, 2020 05:58 IST|Sakshi

జూన్‌ త్రైమాసికంపై ఆర్‌బీఐ గణాంకాలు

ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి

పేలవ దిగుమతుల నేపథ్యం

ముంబై:  కరెంట్‌ అకౌంట్‌ లావాదేవీల విషయంలో 2020 వరుసగా రెండవ త్రైమాసికం ఏప్రిల్‌–జూన్‌లోనూ భారత్‌  మిగులను నమోదు చేసుకుంది. ఈ మొత్తం 19.8 బిలియన్‌ డాలర్లుగా  నమోదయినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన  త్రైమాసికంలో కూడా కరెంట్‌ అకౌంట్‌ మిగులు 0.6 బిలియన్‌ డాలర్లు (0.1 శాతం) నమోదయ్యింది.  

అంటే ఏమిటి?
ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్‌ అకౌంట్‌  ప్రతిబింబిస్తుంది. వస్తువులు, సేవలకు సంబంధించి ఒక దేశం ఎగుమతులు–దిగుమతుల లావాదావీల వ్యయాలు, విదేశీ ఇన్వెస్టర్లకు చేసిన చెల్లింపులు, వారి నుంచి వచ్చిన నిధులు, ఆయా పరిమాణాల వ్యత్యాసాలు అన్నీ కరెంట్‌ అకౌంట్‌లోకి వస్తాయి.  సహజంగా భారత్‌ కరెంట్‌ అకౌంట్‌లోటు (క్యాడ్‌)ను కలిగి ఉంటుంది. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో దిగుమతులు భారీగా పడిపోవడంతో కరెంట్‌ అకౌంట్‌ మిగులు నమోదవుతోంది.  2019–20లో కరెంట్‌ అకౌంట్‌ లోటు 24.6 బిలియన్‌ డాలర్లు. జీడీపీలో ఇది 0.9 శాతం. 2020–2021లో 30 బిలియన్‌ డాలర్ల కరెంట్‌ అకౌంట్‌ ‘మిగులు’ ఉంటుందని ఇక్రా అంచనా.

మరిన్ని వార్తలు