జోరుమీదున్న స్మార్ట్‌ఫోన్స్‌ విక్రయాలు

27 Apr, 2021 14:05 IST|Sakshi

మార్చి త్రైమాసికంలో 23 శాతం వృద్ధి 

మొత్తం 3.8 కోట్ల యూనిట్లు అమ్మకం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 2021 జనవరి-మార్చిలో జోరుగా సాగాయి. వివిధ బ్రాండ్లకు చెందిన మొత్తం 3.8 కోట్ల యూనిట్లు అమ్ముడ య్యాయి. 2020 తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. నూతన మోడళ్లు, ప్రమోషన్స్, ఈఎంఐ పథకాలు, గతేడాది నుంచి కొనసాగుతున్న డిమాండ్‌తో మార్చి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను నడిపించాయి. స్మార్ట్‌ఫోన్స్, ఫీచర్‌ ఫోన్లతో కలిపి పరిశ్రమ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 19 శాతం వార్షిక వృద్ధి సాధించింది. ఫీచర్‌ ఫోన్ల విపణి 14 శాతం అధికమైంది. వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడం జనవరి-మార్చిలో కస్టమర్ల సెంటిమెంటును బలపరిచిందని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్‌ అభిప్రాయపడింది.

రానున్న రోజుల్లో.. 
మార్చి త్రైమాసికంలో జరిగిన స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో 75 శాతం వాటా చైనా బ్రాండ్లదే. షావొమీ,శామ్‌సంగ్, వివో, రియల్‌మీ, ఒప్పో వరుసగా అయిదు స్థానాల్లో ఉన్నాయి. యాపిల్‌ 207 శాతం, వన్‌ప్లస్‌ 300 శాతం వృద్ధి నమోదు చేశాయి. డిమాండ్‌ను పెంచేందుకు అన్ని బ్రాండ్లు కొత్త మోడళ్లు, ప్రమోషన్స్, ఫైనాన్షియల్‌ స్కీమ్స్‌పై దృష్టిసారించాయి. అయితే మహమ్మారి సెకండ్‌ వేవ్‌తో సెంటిమెంటు తగ్గే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్‌ చెబుతోంది. కోవిడ్‌-19, లాక్‌డౌన్స్‌ ప్రభావం రానున్న త్రైమాసికాలపై ఉంటుందని గుర్తు చేసింది. గతేడాది సరఫరా సమస్యలు తలెత్తిన దృష్ట్యా ముందస్తుగా నిల్వలను పెంచుకున్నామని బిగ్‌-సి ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి తెలిపారు.

చదవండి: 

గూగుల్ లో నకిలీ ఫోటోలను కనిపెట్టడం ఎలా?

మరిన్ని వార్తలు