భారత్‌లో తయారీ.. విదేశాలకు రూ.85,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు!

9 Apr, 2023 08:42 IST|Sakshi

దేశీయంగా తయారీ, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్- PLI) పథకం మంచి సత్ఫలితాలనిస్తున్నట్లు తెలుస్తోంది. 

14 రంగాలకు వర్తిస్తోన్న ఈ స్కీమ్‌లో భాగమైన స్మార్ట్‌ ఫోన్‌ రంగం గణనీయమైన ఫలితాలు సాధించింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి (2021-2022)   భారత్‌లో తయారు చేసిన సుమారు రూ. 85 వేల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఇండియా సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (icea) ప్రకటించింది. 

ఎక్స్‌పోర్ట్‌ చేసిన స్మార్ట్‌ ఫోన్‌లు గత ఆర్ధిక సంవత్సరం కంటే ఎక్కువగా రెట్టింపు అయ్యాయని సూచించింది. ఫోన్‌లను యూఏఈ, అమెరికా, నెథర్లాండ్స్‌, యూకే, ఇటలీ దేశాలకు పంపించినట్లు ఐసీఈఏ డేటా తెలిపింది.

ఈ సందర్భంగా ఐసీఈఏ ఛైర్మన్‌ పంకజ్‌ మోహింద్రో మాట్లాడుతూ.. దేశీయంగా 40 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్‌ల తయారీని అధిగమించినట్లు చెప్పారు. 25 శాతం అంటే 10 బిలియన్‌ డాలర్ల విలువైన ఫోన్‌లను విదేశాలకు తరలించినట్లు చెప్పారు. ఇక ఉత్పత్తి చేసిన 97 శాతం ఫోన్‌లను దేశీయంగా అమ్మకాలు జరిగాయని.. తద్వారా భారత్‌ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఫోన్‌ల తయారీ దేశంగా అవతరించిందని అన్నారు. 

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. భారత్‌ ఈ ఏడాది ముగిసే సమయానికి రూ.1లక్షల కోట్ల విలువైన ఫోన్‌లను విదేశాలకు ఎగుమతి చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. పలు నివేదికల ప్రకారం..చైనాలో సప్లయ్‌ చైన్‌ సమస్యల కారణంగా కంటే భారత్‌, వియాత్నం దేశాల్లో స్మార్ట్‌ ఫోన్‌ తయారీ లబ్ధిదారులుగా అవతరించినట్లు అంచనా.

చదవండి👉 భారత్‌లో ఐఫోన్‌ల తయారీ.. యాపిల్‌ అంచనాలు తలకిందులవుతున్నాయా?

మరిన్ని వార్తలు