2030కి 40 బిలియన్ డాలర్లకు చేరనున్న ఈ-కామర్స్ మార్కెట్

17 Aug, 2021 19:09 IST|Sakshi

భారతదేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకొనున్నట్లు కెర్నీ నివేదిక తెలిపింది. 2019లో 4 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ విలువ నుంచి 40 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరగడం, ఎక్కువ మంది ఆన్‌లైన్‌ షాపింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు కెర్నీ నివేదిక తెలిపింది. భారతదేశంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం టైర్ 3 పట్టణాల నుంచి టైర్ 4 పట్టణాలతో పాటు గ్రామాలకు విస్తరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం 4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ-కామర్స్ మార్కెట్ విలువ వేగంగా వృద్ది చెందడం వల్ల 2026 నాటికి 20 బిలియన్ డాలర్లకు, 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 2019లో $ 90 బిలియన్లగా జీవనశైలి రిటైల్ మార్కెట్ విలువ 2026 నాటికి $156 బిలియన్లకు, 2030 నాటికి $215 బిలియన్లను తాకనున్నట్లు అంచనా వేసింది. ఇందులో దుస్తులు, పాదరక్షలు, ఫ్యాషన్ యాక్ససరీలు, కాస్మోటిక్స్, చిన్న ఉపకరణాలు, ఇల్లు వంటి కేటగిరీలు ఉంటాయి.  

"భారతదేశంలో రిటైల్ మార్కెట్ కోవిడ్ నుంచి తిరిగి పుంజుకోవడంతో ఆన్‌లైన్‌ దుకాణదారుల సంఖ్య పెరుగుతోంది. ఇది భారతదేశం ఈ-కామర్స్ ల్యాండ్ స్కేప్ ను పునరుద్ధరిస్తోంది. ఈ విభాగం వేగంగా వృద్ధి చెందడం వల్ల 2030 నాటికి 215 బిలియన్ డాలర్ల మార్కెట్ గా ఆవిర్భవిస్తుంది" అని కెర్నీ పార్టనర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు.ప్రస్తుతం ఉన్న మార్కెట్ డిమాండ్ లో కేవలం 4 శాతం మాత్రమే నేడు ఆన్‌లైన్‌ ద్వారా సేవలందిస్తుండగా, ఇది 2030 నాటికి 19 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. దీంతో భారతదేశంలో ఈ-కామర్స్ 40 బిలియన్ డాలర్ల మార్కెట్ ను సృష్టిస్తుందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు