గాడ్జెట్స్‌ మార్కెట్‌ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే?

27 Aug, 2021 09:06 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో వేరబుల్స్‌ (మన శరీరానికి నేరుగా కాంటాక్ట్‌తో ఉండే ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌) మార్కెట్‌ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ కాలంలో 1.12 కోట్ల యూనిట్ల స్మార్ట్‌వాచెస్, రిస్ట్‌ బ్యాండ్స్, ఇయర్‌వేర్‌ అమ్ముడయ్యాయి.

 ఇందులో ఇయర్‌వేర్‌ 92 లక్షలు, రిస్ట్‌ బ్యాండ్స్‌ 3.72 లక్షలు, స్మార్ట్‌వాచెస్‌ 16 లక్షల యూనిట్లు ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 118.2 శాతం వృద్ధి. దేశీయ కంపెనీలు పెద్ద ఎత్తున ఇయర్‌వేర్, వాచెస్‌ విక్రయం కారణంగా ఈ వృద్ధి సాధ్యపడిందని ఐడీసీ వెల్లడించింది. ‘2021 జనవరి–మార్చితో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ మూలంగా జూన్‌ త్రైమాసికంలో విక్రయాలు 1.3 శాతం తగ్గాయి. గతేడాదితో పోలిస్తే మార్కెట్‌ ఈ ఏడాది త్వరితగతిన రికవరీ అయింది. పండుగల సీజన్‌లో డిమాండ్‌ విపరీతంగా ఉండనుంది. కంపెనీలు ఉత్పత్తుల ధరలను సవరించనున్నాయి. 

గతేడాదితో పోలిస్తే 2021 జూలై–డిసెంబరు కాలంలో 35 శాతం అధికంగా అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉంది. రిస్ట్‌వేర్‌ విభాగంలో వాచెస్‌ వాటా ఏకంగా 81.2 శాతం ఉంది. ఈ విభాగం మరింత పుంజుకోనుంది. రిస్ట్‌వేర్‌ విభాగం 35 శాతం వృద్ధి చెందింది. ఇయర్‌వేర్‌ రెండింతలైంది. యూనిట్ల పరంగా ఈ విభాగానిదే పైచేయి’ అని ఐడీసీ వివరించింది.   

మరిన్ని వార్తలు