ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఐపీవోకు సై

22 Mar, 2023 08:40 IST|Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) ప్రమోట్‌ చేసిన ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్‌ సంస్థలలో బీవోబీ 8.9 కోట్లకుపైగా షేర్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1,30,56,415 షేర్లు చొప్పున ఆఫర్‌ చేయనున్నాయి.

వాటాదారులలో కార్మెల్‌ పాయింట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఇండియా 3.92 కోట్లకుపైగా షేర్లు విక్రయించనుంది. ఇండియాఫస్ట్‌ లైఫ్‌లో బీవోబీ 65 శాతం వాటాను కలిగి ఉంది. వార్‌బర్గ్‌ పింకస్‌ సంస్థ కార్మెల్‌ పాయింట్‌కు 26 శాతం, యూనియన్‌ బ్యాంక్‌కు 9 శాతం చొప్పున వాటా ఉంది. ఇష్యూకి ముందు ప్రిఫరెన్షియల్‌ పద్ధతి లేదా ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌(రైట్స్‌ ఇష్యూ) ద్వారా రూ. 100 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది.

 తాజా ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కంపెనీ గతేడాది అక్టోబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దేశీయంగా మూడో పెద్ద పీఎస్‌యూ బ్యాంక్‌ బీవోబీ, యూనియన్‌ బ్యాంక్‌ కంపెనీకి విస్తారిత బ్యాంకెస్యూరెన్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా మద్దతిస్తున్నాయి.

మరిన్ని వార్తలు