వచ్చే మూడేళ్లలో 100 బిలియన్‌ డాలర్లకు ఈ-కామర్స్‌

28 Jan, 2021 15:28 IST|Sakshi

100 బిలియన్‌ డాలర్లకు ఈ-కామర్స్‌ పరిశ్రమ  : ఫ్లిప్‌కార్ట్‌  కల్యాణ్‌ కృష్ణమూర్తి

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే మూడు నాలుగేళ్లలో దేశీయ ఈ-కామర్స్‌ పరిశ్రమ 90-100 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. కరోనాకు ముందు ఈ-కామర్స్‌ వృద్ధి రేటు 26-27 శాతంగా ఉందని, కరోనా తర్వాత ఇది 30 శాతానికి పెరిగిందని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. చైనా ఆన్‌లైన్‌ మార్కెట్లో  ఈ-కామర్స్‌ వాటా 25 శాతంగా ఉంటే.. ఇండియాలో 3.5 శాతంగా ఉందని, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 10-25 శాతమని చెప్పారు. (పసిడి డిమాండ్‌కు కరోనా కాటు)

రాబోయే కొన్నేళ్లలో దేశీయ ఈ-కామర్స్‌ మార్కెట్‌ ఆధునిక రిటైల్‌ మార్కెట్ల కంటే చాలా పెద్దగా ఉంటుందన్నారు. కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయని.. ఇది ఈ-కామర్స్‌ రంగానికి వృద్ధి చోదకాలుగా మారుతాయని పేర్కొన్నారు. కరోనాతో వ్యాపారాలు ఎంత ప్రభావితం అయ్యాయో.. అంతే స్థాయిలో కొత్త అవకాశాలు కూడా తెరుచుకున్నాయని ఆయన పేర్కొన్నారు. కిరాణా వ్యవస్థలో అన్ని పరిమాణాల వ్యాపారాలకు ఆధునిక రిటైల్‌ మంచి బిజినెస్‌ అవకాశమని, స్మాల్‌ బిజినెస్, చేతివృత్తులు వంటివి డిజిటల్‌ రిటైల్‌తో మంచి చాన్స్‌లుంటాయని.. ఈ దిశలో ఫ్లిప్‌కార్ట్‌ కృషి చేస్తోందని ఆయన వివరించారు. 2019లో దేశ జనాభాలో 10 శాతం మంది ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జరిపారని కృష్ణమూర్తి తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది ఇంట్లోనే ఉండాల్సి రావటంతో కిరాణా, నిత్యావసరాల కొనుగోళ్ల కోసం ఆన్‌లైన్‌ మీద ఆధారపడ్డారని.. లాక్‌డౌన్‌ తర్వాత కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో వంద పిన్‌కోడ్స్‌లో ఈ-కామర్స్‌ ఆర్డర్లు వస్తున్నాయని.. 60 శాతానికి పైగా లావాదేవీలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే జరుగుతున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు