ఇండియన్ ఎకానమీలో ఈ–గేమింగ్‌ హవా!

19 Mar, 2022 10:19 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఎకానమీలో భాగంగా ఈ–స్పోర్ట్స్, ఈ–గేమింగ్‌ విభాగాలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించగలవని ఆలిండియా గేమింగ్‌ ఫెడరేషన్‌ (ఏఐజీఎఫ్‌) పేర్కొంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ను నిషేధించాలన్న ప్రతిపాదనలను కొన్ని హైకోర్టులు తోసిపుచ్చిన నేపథ్యంలో ఈ రంగానికి సంబంధించి రాష్ట్రాల ప్రభుత్వాలు తగు మార్గదర్శకాలు రూపొందించాలని ఒక ప్రకటనలో కోరింది. 

ఇటీవలి అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ దేశీయంగా గేమింగ్‌ మార్కెట్‌ 2025 నాటికి 6–7 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుందని ఏఐజీఎఫ్‌ తెలిపింది. ప్రస్తుతం ఇది 1.8 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. ‘భారత్‌లో 200 పైగా ప్లాట్‌ఫామ్స్‌లో 20 కోట్ల మంది పైగా ఈ–గేమర్లు ఆడుతున్నారు. డిజిటల్‌ ఎకానామీ గొడుగు కింద ఈ–స్పోర్ట్స్, ఈ–గేమింగ్‌ విభాగాలు దేశ ఎకానమీ వృద్ధిలో కీలక పాత్ర పోషించగలవు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదిగే దిశగా.. ఈ–గేమింగ్‌ పరిశ్రమకు భారీ స్థాయిలో విధానపరమైన మార్గదర్శకాలు, డిజిటల్‌ ఇన్‌ఫ్రా అవసరం‘ అని ఏఐజీఎఫ్‌ ప్రెసిడెంట్‌ పి.కె. మిశ్రా తెలిపారు.  

అంతర్జాతీయంగా గుర్తింపు.. 
ఈ–స్పోర్ట్స్, ఈ–గేమింగ్‌ ప్లేయర్లు అంతర్జాతీ యంగా కూడా గుర్తింపు పొందుతున్నారని ఏఐజీఎఫ్‌ తెలిపింది. 2022 సెప్టెంబర్‌లో జరిగే ఏషియన్‌ గేమ్స్‌లో తొలిసారిగా ఈ–స్పోర్ట్స్‌ కేటగిరీని కూడా అధికారికంగా చేర్చినట్లు వివరించింది. కీలకమైన గ్లోబల్‌ మార్కెట్లలో భారత్‌ కూడా చేరబోతోందని మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌) సహ వ్యవస్థాపకుడు, సీఈవో సాయి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు