Microsoft: బగ్‌ను కనిపెట్టి రూ. 22 లక్షలు గెలుచుకున్న ఢిల్లీ యువతి

29 Jun, 2021 17:58 IST|Sakshi

ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ అదితి సింగ్ మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్ సర్వీస్‌ అజ్యూర్‌లో బగ్‌ను గుర్తించినందుకు 30,000 డాలర్ల(సుమారు రూ.22 లక్షలు) రివార్డును గెలుచుకుంది. కేవలం రెండు నెలల క్రితం ఫేస్ బుక్ లో ఇలాంటి బగ్ ను కనుగొన్న అదితి 7500 డాలర్ల(సుమారు రూ.5.5 లక్షలకు పైగా) రివార్డు గెలుచుకుంది. రెండు కంపెనీలకు చెందిన రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్(ఆర్‌సీఈ)లో బగ్ ఉన్నట్లు కనుగొంది. ఇటువంటి బగ్స్ ద్వారా హ్యాకర్లు సులువుగా ఇంటర్నల్ సిస్టంలోకి ప్రవేశించి అందులోని సమాచారాన్ని పొందగలరని గుర్తించింది. 

ఇలాంటి బగ్స్ గుర్తించడం అంత సులభం కాదని, ఎథికల్ హ్యాకర్లు కొత్త బగ్స్ గురించి వారి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపింది. కేవలం డబ్బు సంపాదించడంపై దృష్టి సారించడం కంటే, మొదట ఎథికల్ హ్యాకింగ్ గురించి జ్ఞానం సంపాదించుకోవాలని సూచిస్తుంది. సైబర్‌ నేరగాళ్ల  భారీ నుంచి తప్పించుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ ప్రోగ్రాంలను అప్‌డేట్‌ చేస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిలో కొన్ని లోపాలు ఉంటుంటాయి. అలాంటి వాటిని ముందుగా కనిపెట్టి తమ దృష్టి తీసుకొచ్చిన వారికి కంపెనీలు నగదు బహుమతి అందజేస్తుంటాయి. ఈ బగ్ గురుంచి రెండు నెలల క్రితమే మైక్రోసాఫ్ట్ కు నివేదించినట్లు అదితి సింగ్ తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్‌ దీనిపై వెంటనే స్పందిచలేదని బగ్‌ ఉన్న ప్రోగ్రాంను యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకోలేదని నిర్థారించుకున్న తర్వాత లోపాన్ని సరిచేసినట్లు తెలిపింది.

బగ్ బౌంటీ కోసం ఎక్కువగా సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు లేదా భద్రతా పరిశోధకులు పోటీ పడుతుంటారు. వారు సదరు వెబ్ ను క్రాల్ చేస్తారు. హ్యాకర్లు చొరబడి కంపెనీలకు హానిచేయగల బగ్స్ ఉన్నాయా? లేదా అని మొత్తం కోడ్ ను స్కాన్ చేస్తారు. ఒకవేళ వారు ఏమైనా లోపాన్ని కనిపెడితే వారికి నగదు బహుమతిగా ఇవ్వబడుతుంది. ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ లో గుర్తించబడిన ఆర్‌సీఈ బగ్ గురించి అదితి మాట్లాడుతూ.. డెవలపర్లు మొదట ఎన్‌పీఏ (నోడ్‌ ప్యాకేజ్‌ మేనేజర్‌)ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే కోడ్ రాయాలని సూచించింది. ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, మైక్రోసాఫ్ట్‌, మొజిల్లా, పేటీఎం, ఎథీరియమ్‌, హెచ్‌పీ వంటి దిగ్గజ కంపెనీల్లో సుమారు 40 వరకు బగ్‌లను కనుగొన్నట్లు తెలిపింది. మెడికల్ ఎంట్రన్స్‌లో సీటు రాకపోవడంతో ఎథికల్ హ్యాకింగ్‌పై దృష్టి సారించినట్లు అదితి చెప్పుకొచ్చింది. ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ప్రశంసా లేఖలను అందుకుంది. 

చదవండి: రూ.80కే.. 800 కిలోమీటర్ల ప్రయాణం

మరిన్ని వార్తలు