భారత్‌ ఆర్థిక స్థిరత్వానికి ఢోకా లేదు, రూపాయిపై ఆందోళన అక్కర్లేదు 

23 Nov, 2022 10:24 IST|Sakshi

ఆదాయాలు పటిష్టం

రుణంలో స్థిరీకరణ ఉంది మూడీస్‌ నివేదిక

న్యూఢిల్లీ: భారత్‌ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ– మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ స్పష్టం చేసింది. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయని, రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయని వివరించింది. ఆయా అంశాలు ఊహించినదానికన్నా వేగంగా సానుకూలతను సంతరించుకుంటున్నట్లు వివరించింది.  ఆయా అంశాలు దేశంపై రేటింగ్‌కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి.   ’సావరిన్‌ డీప్‌ డైవ్‌’ పేరు­తో మూడీస్‌ నిర్వహించిన ఒక వెర్చువల్‌ కార్యక్రమంలో మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టియన్‌ డి గుజ్మాన్‌ మాట్లాడుతూ,

 భారతదేశానికి మూడీస్‌  ‘బీఏఏ3’ సార్వభౌమ రేటిం­గ్‌ ఇస్తోంది. అధిక రుణ భారం ఉన్న  అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌ ఎకానమీ బలహీనతలను అధిక ఆర్థిక వృద్ధి పటిష్టత సమతౌల్యం చేస్తుంది. భారత్‌ కార్పొరేట్‌ వ్యవస్థ కూడా ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ప్రతిబింబిస్తోంది.  
 2022 చివరి నాటికి భారత్‌ రుణ నిష్పత్తి (దేశ స్థూలదేశీయోత్పత్తి– జీడీపీలో) 84 శాతంగా ఉంటుందన్నది అంచనా. పలు వర్థమాన దేశాలకన్నా ఇది ఎక్కువ.  
  వచ్చే ఏడాది భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీ–20 ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మేము భావిస్తున్నాము. అయితే కుటుంబాలు, వ్యాపార సంస్థలు  తక్కువ కొను­గోలు శక్తి సవాళ్లను ఎదుర్కోవడం ప్రస్తుతం కీల­క సవాలుగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం భారతదేశ వృద్ధికి ప్రతికూల ప్రమాదాలను సృష్టిస్తోంది.  
 భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్‌ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం జరిగింది.  ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం.  తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్‌ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది.  
   2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్‌ అంచనా.  2021 క్యాలెండర్‌ ఇయర్‌­లో భారత్‌ వృద్ధి 8.5 శాతమని మూడీస్‌ పేర్కొంది.  
  బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయి.  
 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్‌ మందగిస్తుంది.  2023లో జీ-20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణించే అవకాశం ఉంది.  
 మెరుగైన పన్ను వసూళ్ల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా  6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం  అవుతుందన్న అం­చ­నాలు ఉన్నాయి.  2022-23లో ద్రవ్య­లోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  
 మూడీస్‌ గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్‌’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్‌గ్రేడ్‌ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్‌ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్‌కు ఒక అంచె అధికం కావడం గమనార్హం.  

రూపాయిపై ఆందోళన అక్కర్లేదు..  
భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది.  విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదని భావిస్తున్నాం. రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు. అక్టోబర్‌ 19న  అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.05నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్‌ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన దోరణిలోనే ఉందన్నది విశ్లేషణ.    

మరిన్ని వార్తలు