Gaganyaan Mission: మరో కీలక ముందడుగు

23 Mar, 2021 11:46 IST|Sakshi

మాస్కో: భారత్‌ మానవసహిత అంతరిక్ష యాత్రకు గగన్‌యాన్‌ మిషన్‌ను ఇస్రో పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. అందుకుగాను  మిషన్‌లో భాగంగా వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు, రష్యాలోని మాస్కో సమీపంలో ఉన్న జైయోజ్డ్నీ గోరోడోక్ నగరంలో ఏడాది శిక్షణా కోర్సును పూర్తి చేశారు. గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పూర్తి చేసిన భారతీయ వ్యోమగాములను సోమవారం కలిశానని రష్యన్ స్టేట్ స్పేస్ కార్పొరేషన్ అధిపతి డిమిత్రి రోగోజిన్ తెలిపారు.

ఇరు దేశాల భవిష్యత్ ద్వైపాక్షిక అంతరిక్ష ప్రాజెక్టుల గురించి భారత రాయబారితో కూడా చర్చించామని ఆయన వెల్లడించారు. దీంతో  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన ఒక కీలక అడుగుపడినట్టయింది.

జూన్ 2019 లో భారత వైమానిక అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో, రష్యన్ లాంచ్ సర్వీస్ ప్రొవైడర్ గ్లావ్‌కాస్మోస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ శిక్షణకు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) చెందిన నలుగురు పైలట్లను ఎంపిక చేశారు.​ కోవిడ్‌-19 కారణంగా పైలట్ల శిక్షణకు కొంత బ్రేక్‌ పడింది. 2020 ఫిబ్రవరి 10న వీరి శిక్షణ మొదలైంది. వీరి శిక్షణానంతరం భారత్‌లో ఇస్రో తయారుచేసిన మాడ్యుల్‌లో సిములేషన్‌ ట్రయళ్లు జరపనున్నట్లు సమాచారం. గగన్‌యాన్‌ ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం పదివేల కోట్లను కేటాయించింది.

(చదవండి: 2022లో చంద్రయాన్‌-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్ )

మరిన్ని వార్తలు