Railways: ‘స్పెషల్‌’ పేరుతో బాదారు.. ఇప్పుడేమో ?

29 Jun, 2021 14:27 IST|Sakshi

న్యూఢిల్లీ : కోవిడ్‌ కాలంలో స్పెషల్‌ పేరుతో ఎడాపెడా టిక్కెట్ల రేట్లు పెంచినా... సబ్సీడీలు తగ్గించినా రైల్వే శాఖ కష్టాలు తీరలేదు. నిర్వహణ వ్యయం మెరుగవలేదు.  తాజాగా ఆ శాఖ వెల్లడించిన గణాంకాలు ఇదే విషయం తెలియజేస్తున్నాయి. 

మెరుగుపడని ఓఆర్‌
కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా 2020 మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఆ తర్వాత క్రమంగా రైళ్లను పునరుద్ధరించినా ... గరిష్టంగా 65 శాతం రైళ్లనే నడిపించింది రైల్వేశాఖ. ఐనప్పటికీ ఆపరేటింగ్‌ రేషియో (ఓఆర్‌)లో మెరుగైన ఫలితాలు రాలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 97.45 శాతం అంతకు ముందు ఆర్థిక సంవత్సరానికి 98.36 శాతం ఓఆర్‌ సాధించింది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌  పెట్టిన ఆర్జీతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 

సబ్సిడీలు రద్దు
కోవిడ్‌ కాలంలో నష్టాలను తగ్గించుకునేందుకు సీజనల్‌ టిక్కెట్స్‌ రద్దు చేసింది, వికలాంగ, వృద్ధులు, రోగుల రాయితీలు రైల్వే పక్కన పెట్టింది. ఒకటేమిటీ కరోనా పేరుతో అందించే సబ్సీడీలు అన్నింటికీ కోత పెట్టింది... సామాన​‍్యుల జేబుకు చిల్లు పెట్టింది ఇండియన్‌ రైల్వేస్‌. ఏడాది పాటు బాదుడు కార్యక్రమం నడిపించింది. ఐనా సరే సానుకూల ఫలితాలు పొందలేదు రైల్వేశాఖ. 

స్పెషల్‌ బాదుడు
కోవిడ్‌ ఆంక్షల పేరుతో రైళ్లు నడిపించడంపై రైల్వేశాఖ ఏకపక్షంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్‌ రైళ్లను నడిపించకపోవడం, ఇదే సమయంలో ఆదాయం పెంచుకోవడం కోసం సాధారణ రైళ్లకు కూడా, స్పెషల్‌ స్టేటస్‌ తగిలించి టికెట్‌ రేట్లు పెండచడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలను ఇబ్బందులు పాలు చేసినా లక్ష్యాన్ని రైల్వేస్‌ అందుకోలేకపోయింది

ఆదా
పలు కీలక రూట్లలో ఎలక్ట్రిఫికేషన్‌ చేయడం ద్వారా రూ. 9,500 కోట్లు ఆదా చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. దీంతో పాటు రైల్వే ఉద్యోగుల విధులను క్రమబద్ధీకరించడం ద్వారా అదనంగా మరో రూ. 4,000 కోట్లు మిగులు వచ్చిందని ప్రకటించింది. 

చదవండి : సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు