Indian Railways: రైలులో ప్రయాణం.. ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ సేవలు ఉచితం!

2 Aug, 2022 12:49 IST|Sakshi

దేశంలో తక్కువ ఖర్చుతో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించాలంటే అది భారతీయ రైల్వేతోనే సాధ్యం. ఇండియన్‌ రైల్వే ప్రపంచలోనే నాలుగో అతి పెద్ద సంస్థగా పేరు పొందింది. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానానికి చేర్చడంతో పాటు కోట్ల రూపాయల సరుకులు కూడా రవాణ చేస్తుంది మన చుకు చుకు బండి. అంతేనా మిడిల్‌ క్లాస్‌ నేల విమానంగా పేరు కూడా ఉంది. ఇటీవల ప్యాసింజర్లకు కొన్ని ఉచిత సేవలని కూడా ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. చాలామంది ప్రయాణికులకు ఇలాంటి సౌకర్యాలు ఉచితంగా భారతీయ రైల్వే అందిస్తున్న విషయం కూడా తెలియదు. అవేంటో ఓ లుక్కేద్దాం..

ప్రయాణికులకు క్లాస్ అప్‌గ్రేడేషన్.. అదనపు చార్జ్‌ ఉండదు
టిక్కెట్ల బుకింగ్ సమయంలో, రైల్వే ప్రయాణికులకు క్లాస్ అప్‌గ్రేడేషన్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తుంది ఇండియన్‌ రైల్వే. అంటే, స్లీపర్‌లోని ప్రయాణీకుడు థర్డ్ ఏసీని పొందవచ్చు, అది కూడా స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌తోనే. దీనికి ఎటువంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన పని లేదు. ఈ తరహాలోనే థర్డ్‌ ఏసీ ప్యాసింజర్ సెకండ్ ఏసీ, సెకండ్ ఏసీ ప్యాసింజర్ వన్‌ టైర్‌ ఏసీ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందడానికి, ప్రయాణీకులు టికెట్ బుకింగ్ సమయంలో ఆటో అప్‌గ్రేడ్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత, అందుబాటులో ఉన్న సీట్లను బట్టి, ప్రయాణికుల రైల్వే టిక్కెట్‌ను వారు ఎంచుకున్న ఆఫ్షన్‌ ప్రకారం అప్‌గ్రేడ్ చేస్తారు. అయితే, ప్రతిసారీ టిక్కెట్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు.

వికల్ప్ సర్వీస్‌ ఎంచుకుంటే బెటర్‌
తమ టికెట్‌ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్యాసింజర్లు వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి అవసరం లేకుండా రైల్వే శాఖ ‘వికల్ప్ సర్వీసు’ను ప్రారంభించింది.  ఇది మరొక మనం బుక్‌ చేసుకున్న ట్రెన్‌లో సీటు లేకపోతే మన గమ్య స్థానానికి వెళ్లే మరొక రైలులో సీట్ల లభ్యత ఆధారంగా మనకి సీటుని కేటాయిస్తారు. ఇందుకోసం టికెట్ బుకింగ్ సమయంలోనే వికల్ప్‌ సర్వీస్‌ ‘ఆప్షన్’ ఎంచుకోవాలి. ఆ తర్వాత రైల్వే ఈ సౌకర్యాన్ని ఉచితంగానే కల్పిస్తుంది.

టిక్కెట్ల ట్రాన్స్‌ఫర్‌
రైల్వే టిక్కెట్లను బదిలీ (ట్రాన్స్‌ఫర్‌) చేయచ్చు. ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా ప్రయాణం చేయలేకపోతే, అతను తన కుటుంబంలోని ఎవరికైనా తన టిక్కెట్‌ను బదిలీ చేయవచ్చు. అయితే, ప్రయాణ రోజు నుంచి 24 గంటల ముందు టికెట్ బదిలీ చేయాల్సి ఉంటుంది. దీని కోసం, టిక్కెట్ ప్రింట్ తీసుకొని, సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికుడు తన ఐడీ (గుర్తింపు కార్డు) స్టేషన్‌లో చూపించి ఆ టిక్కెట్‌ని బదిలీ చేయవచ్చు. అయితే, టిక్కెట్లను ఒక్కసారి మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేయగలరు.

బోర్డింగ్‌ స్టేషన్‌ మార్చవచ్చు
టికెట్ బదిలీ మాదిరిగానే, బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సౌకర్యం కూడా 24 గంటల ముందుగానే అందుబాటులో ఉంటుంది. అంటే, ఒక ప్రయాణీకుడు హైదరాబాద్‌ నుంచి టిక్కెట్‌ను బుక్ చేసి, ఆ రైలు మార్గంలో మరేదైనా స్టేషన్ నుంచి ఎక్కాలనుకుంటే, అతను తన స్టేషన్‌ను మార్చవచ్చు. బోర్డింగ్ స్టేషన్‌లో మార్పు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. ఇందుకు ఐఆర్‌టీసీ(IRCTC) వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత, బుక్ చేసిన టికెట్ హిస్టరీకి వెళ్లడం ద్వారా మీరు బోర్డింగ్ స్టేషన్‌ని మార్చుకోవాలి. అయితే, మార్చుకునే సదుపాయం ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది

చదవండి: అదానీ దూకుడు: మూడు లక్షల కోట్లు దాటేసిన నాలుగో కంపెనీ

మరిన్ని వార్తలు