Realty ఈక్విటీ జోష్‌ : వేల కోట్ల పెట్టుబడులు

14 Jul, 2021 09:04 IST|Sakshi

6 నెలల్లో రూ.14,300 కోట్ల  పెట్టుబడులు    

సావిల్స్‌ ఇండియా రిపోర్ట్‌ వెల్లడి 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా సమయంలోనూ దేశీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) జోరు తగ్గట్లేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్‌) రియలీ్టలోకి 2.7 బిలియన్‌ డాలర్లు (రూ.14,300 కోట్ల) పీఈ పెట్టుబడులు వచ్చాయి. వాణిజ్య ఆస్తులకు డిమాండ్‌ పెరగడమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సావిల్స్‌ ఇండియా తెలిపింది. గతేడాది జనవరి–జూన్‌లో 870 మిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌.. ఏడాది మొత్తంలో 6.6 బిలియన్‌ డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. కోవిడ్‌ నేపథ్యంలో మందగమనం ఉన్నప్పటికీ పెట్టుబడిదారులలో విశ్వాసం చెక్కుచెదరలేదని పీఈ పెట్టుబడుల వెల్లువకు ఇదే నిదర్శనమని తెలిపింది. త్రైమాసికం వారీగా చూస్తే ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ (క్యూ2) క్వాటర్‌లో పీఈ పెట్టుబడులు 54 శాతం క్షీణించి 865 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

వర్క్‌ ఫ్రం హోమ్, రిమోట్‌ వర్కింగ్‌ విధానాలు అమలులో ఉన్నప్పటికీ ఈ ఏడాది క్యూ2లో వాణిజ్య కార్యాలయ లావాదేవీలు జోరుగానే సాగాయని.. పెట్టుబడులలో వీటి 40 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఈ తర్వాత 33 శాతం పెట్టుబడుల వాటాతో రిటైల్‌ విభాగం ఉంది. కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ (సీపీపీఐబీ), జీఐసీ వంటి విదేశీ పెట్టుబడిదారులు కోల్‌కతా, ముంబై, పుణే నగరాలలో రిటైల్‌ విభాగంలో 21 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు రిపోర్ట్‌ వెల్లడించింది. కోవిడ్‌ నేపథ్యంలోనూ వాణిజ్య ఆఫీస్‌ విభాగంలో విదేశీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగుతున్నాయని.. ఈ రంగంలో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఇది సూచిస్తుందని సావిల్స్‌ ఇండియా ఎండీ దివాకర్‌ రానా తెలిపారు. సమీప భవిష్యత్తులోను ఇలాంటి లావాదేవీలే జరుగుతాయని అంచనా వేశారు.

మరిన్ని వార్తలు