11300 స్థాయిని పరీక్షిస్తున్న నిఫ్టీ
ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
ప్రపంచమార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
కలిసొచ్చిన ఫెడ్ రిజర్వ్ యథాతథ పాలసీ విధానం
జూలై డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో గురువారం దేశీయ మార్కెట్ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 38321 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 11263 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఒక్క మీడియా తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు లాభపడుతున్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్నిఫ్టీ ఇండెక్స్ అరశాతానికి పైగా లాభపడి 22,226.05 వద్ద ట్రేడ్ అవుతోంది.
నేడు డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కావడంతో ట్రేడర్లు తమ పోజిషన్లను రోలోవర్ చేసుకోనున్నారు. రియలన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, డాబర్ ఇండియాతో పాటు 403 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. దేశ ప్రధాని మోదీ ఆర్బీఐ, సెబీలతో సహా ప్రధాన ఫైనాన్స్ రంగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించున్నారు. కేంద్రం అన్లాక్ ప్రక్రయలో భాగంగా నిన్నటి రోజున కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేటి ట్రేడింగ్లో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. ఫలితంగా నిన్నరాత్రి అక్కడి సూచీలు అరశాతం నుంచి ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. నేడు మనమార్కెట్ ప్రారంభసమయానికి ఆసియాలో జపాన్ సింగపూర్ దేశాలకు చెందిన సూచీలు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో కదలుతున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిల్టెల్, విప్రో షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. గ్రాసీం, సన్ఫార్మా, ఇండస్ఇండ్, ఐఓసీ, బీపీసీఎల్ షేర్లు 0.75శాతం నుంచి 4శాతం నష్టాన్ని చవిచూశాయి.