వేలకోట్ల బిజినెస్‌: అమెరికాను ఏలేస్తున్న ఇండియన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు!

14 Jul, 2022 14:03 IST|Sakshi

మనదేశానికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు అమెరికా ఆర్ధిక వ్యవస్థను శాసిస్తున్నాయి. లక్షల మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నాయి. వేలకోట్ల బిజినెస్‌ మార్కెట్‌తో అమెరికా ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని నాస్కామ్‌ - ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో భారతీయ టెక్‌ కంపెనీల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నాస్కామ్‌ - ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ నివేదిక ప్రకారం..2017 నుంచి భారత్‌కు చెందిన టెక్‌ కంపెనీలు 22శాతం వృద్దితో అమెరికన్‌లకు ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. అలా నాటి నుంచి యావరేజ్‌ శాలరీ ఒక్కొక్కరికి 1,06,360 డాలర్లను చెల్లిస్తూ 2లక్షల మందికి పైగా అమెరికన్‌లతో పలు ప్రాజెక్ట్‌లపై పనిచేయించుకుంటున్నాయి. "మన దేశానికి చెందిన టెక్‌ సంస్థలు అమెరికన్‌ ఉద్యోగులతో పాటు కొత్త కొత్త టెక్నాలజీపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. తద్వారా పరిశ్రమలు, క్లయింట్ల కోసం అత్యాధునిక ఆవిష్కరణలను వెలుగులోకి తెస్తున్నాయని" నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేబ్జానీ ఘోష్ అన్నారు. 
 
అమెరికాలోనే ఎక్కువ
వరల్డ్‌ వైడ్‌గా ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో డిమాండ్‌ - సప్లయ్‌ ఎక్కువగా ఉంటుందని ఘోష్‌ తెలిపారు. వాటి ఆధారంగా ఈ డిజిటల్‌ వరల్డ్‌లో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ..సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో అందుకు కావాల్సిన నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ ఫార్చ్యూన్‌ - 500 కంపెనీస్‌లో సుమారు 75శాతం ఇండియన్‌ కంపెనీలు అమెరికా ప్రధాన కేంద్రంగా ప్రాజెక్ట్‌లపై వర్క్‌ చేస్తున్నాయి.    

అమెరికన్‌ ఎకానమీకి వెన్నుదన్నుగా
కరోనాతో పాటు ఇతర సంక్షోభాల నుంచి గట్టెక్కేలా అమెరికా ఎకానమీకి వెన్నుదన్నుగా భారత్‌ కంపెనీలు నిలుస్తున్నాయి. అలా 2021 అమెరికాకు చెందిన 20 రాష్ట్రాలలో 1.6 మిలియన్‌ మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పించడంతో పాటు 396 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు జరిపాయి. తద్వారా 198 బిలియన్‌ డాలర్ల నిధుల్ని అందించి అమెరికా ఎకానమీకి పరోక్షంగా సహకరిస్తున్నాయి.     

స్వామి కార్యం స్వకార్యం 
స్వామి కార్యం స్వకార్యం అన్న చందంగా భారత్‌ టెక్‌ కంపెనీలు అమెరికాలో పెట్టబడులతో లాభాల్ని అర్జిస్తున్నాయి. అదే సమయంలో అమెరికన్‌ల వృద్ది కోసం పాటు పడుతున్నాయి. అంతేకాదు ప్రజెంట్‌ జనరేషన్‌ తో పాటు నెక్ట్స్‌ జనరేషన్‌లో ఈజీగా జాబ్స్‌ పొందేలా ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తూ భారత్‌ టెక్‌ కంపెనీలు భారీగా నిధుల్ని ఖర్చు చేస్తున్నాయని నాస్కామ్‌ నివేదిక హైలెట్‌ చేసింది.   

స్టెమ్‌లో రాణించేలా
నాస్కామ్‌ నివేదికలో పేర్కొన‍్నట్లుగా..ఇండియన్‌ టెక్‌ కంపెనీలు అమెరికాలో 180 యూనివర్సీలు, కాలేజీలు, కమ్యూనిటీ కాలేజీలతో పాటు ఇతర ఎడ్యుకేషన్‌కు సంబంధించిన స్వచ్ఛంద సంస్థల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌(స్టెమ్‌) వ్యవస్థను బలోపేతం చేసేలా 1.1 బిలియన్‌ డాలర్ల నిధుల్ని ఖర్చు చేశాయి. దీంతో పాటు స్కూల్స్‌ ఎడ్యుకేషన్‌ వ్యవస్థను పటిష్టం చేసేందుకు, అకడమిక్, కార్యాచరణ, ప్రోగ్రామ్, అడ్మినిస్ట్రేటివ్ సవాళ్లను పరిష్కరించడంలో నిష్ణాతులయ్యేలా డిజైన్‌ చేసిన కే-12 అనే కార్యక్రమం కోసం 3 మిలియన్లకు పైగా ఖర్చు చేశాయి. ఆ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 2.9 మిలియన్ల మంది విద్యార్ధులు, ఉపాధ్యాయులు లబ్ధి పొందారు. అదనంగా, 2,55,000 మంది ప్రస్తుత ఉద్యోగులు ఈ రంగం ద్వారా నైపుణ్యం పొందారు 

అవకాశాల గని
అమెరికాలో వచ్చే దశాబ్దంలో ఇతర వృత్తుల కంటే స్టెమ్‌ వృత్తుల డిమాండ్ 1.5 రెట్లు వేగంగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం యూఎస్‌లో ఐటీ రంగం 70శాతం వృద్ది నమోదు చేస్తుంటే..2030 నాటికి స్టెమ్‌ విభాగంలో ఉపాధి అవకాశాలు 51 శాతంగా ఉండనున్నాయి.  

అమెరికాలో అలా భారత్‌లో ఇలా 
అమెరికాలో టెక్నాలజీ రంగంలో విసృత అవకాశాలతో పాటు ఉద్యోగాల రూప కల్పన జరుగుతుంది. కానీ భారత్‌లో టెక్‌ కంపెనీల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశీయంగా హెచ్‌సీఎల్‌ సంస్థ జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 6వేల మందికి పైగా ఫ్రెషర్‌లను నియమించుకున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అట్రిషన్‌ రేట్‌ ఆ సంస్థను కుదిపేస్తుంది. టీసీఎస్‌ సైతం జూన్, 2022 త్రైమాసికంలో 14,136 మంది ఉద్యోగుల్ని హయర్‌ చేసుకుంది. జూన్, 2022 త్రైమాసికంలో ఐటీ విభాగంలో అట్రిషన్ రేటు 19.7 శాతంగా ఉంది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 17.4 శాతంతో పోలిస్తే ఎక్కువ అని టీసీఎస్ తెలిపింది.

మరిన్ని వార్తలు