ఆర్థిక భద్రతకు మొదటి ప్రాధాన్యం

24 Feb, 2022 06:32 IST|Sakshi

కరోనా తీసుకొచ్చిన మార్పు

జీవిత బీమా పట్ల పెరిగిన అవగాహన

మ్యాక్స్‌ లైఫ్‌ వార్షిక సర్వే

న్యూఢిల్లీ: జీవిత బీమా పట్ల భారతీయుల్లో గత రెండు సంవత్సరాల్లో ఎంతో అవగాహన పెరిగినట్టు మ్యాక్స్‌ లైఫ్‌ ‘ఇండియా ప్రొటెక్షన్‌ క్వొటెంట్‌’ (ఐపీక్యూ) సర్వే తెలిపింది. ఈ సంస్థ వార్షికంగా సర్వే నిర్వహిస్తుంటుంది. ఇది నాలుగో ఎడిషన్‌ సర్వే. 2021 డిసెంబర్‌ 10 నుంచి 2022 జనవరి 14 వరకు ఆన్‌లైన్‌లో ఈ సర్వేను నిర్వహించింది.  

► పట్టణ ప్రాంతాల్లో ప్రొటెక్షన్‌ క్వొటెంట్‌ 3 పాయింట్లు పెరిగి 50కు చేరుకుంది. గతంతో పోలిస్తే ఇది క్రమంగా పెరుగుతోంది.  
► కరోనా భయాలు తగ్గిపోతుండడంతో పట్టణ ప్రాంతాల్లోని పాలసీదారులు పిల్లల విద్య, రిటైర్మెంట్‌ వంటి ప్రణాళికలను సమీక్షించుకుంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది.
► కరోనా వల్ల ఏర్పడిన ఆందోళనలు తగ్గినా, వ్యక్తిగత రక్షణ విషయంలో ఆందోళన నెలకొంది.   
► మెట్రోలు, టైర్‌ 1, టైర్‌ 2 పట్టణాల్లో ప్రొటెక్షన్‌ ఇండెక్స్‌ పెరిగింది. అంటే రక్షణ పట్ల అవగాహన విస్తృతం అయింది.  
► ముఖ్యంగా టైర్‌–2 ప్టణాల్లో జీవిత బీమా పట్ల అవగాహన 61 పాయింట్ల నుంచి 68 పాయింట్లకు ఎగిసింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో జీవిత బీమా పట్ల అవగాహనను ఇది తెలియజేస్తోంది.
► టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే వారి శాతం గతేడాది ఉన్న 39 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది.
► పట్టణ ప్రాంతాల్లో సగానికంటే ఎక్కువ మంది తమకున్న టర్మ్‌ కవరేజీ సరిపడదన్న అభిప్రాయంతో ఉన్నారు.  
► పాలసీదారులు కట్టాల్సిన ప్రీమియం కంటే కూడా, తమకు కావాల్సిన బీమా రక్షణపైనే దృష్టి పెడుతుండడం మార్పునకు నిదర్శనం.
► చివరి గమ్యం వరకు జీవిత బీమా పట్ల అవగాహన కలిగించే విషయంలో అడ్డంకులను అధిగమించాల్సి రావడం పరిశ్రమ ముందున్న సవాలుగా ఈ సర్వే పేర్కొంది.  

అవగాహన విస్తృతం
‘‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జీవిత బీమా పట్ల అవగాహన పెరిగినట్టు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత అవగాహన గణనీయంగా పెరిగింది. కరోనా సమసిపోతున్నా గరిష్ట స్థాయిలో అవగాహన కొనసాగుతుండడం సంతోషకరం. ప్రజలు మరింత రక్షణాత్మకంగా వ్యవహరిస్తుండడం అన్నది మంచిది. ఈ అవగాహన కొనుగోళ్లకు దారితీస్తోంది. టర్మ్, సేవింగ్స్, యూనిట్‌ లింక్డ్‌ పాలసీలు ఇలా అన్ని విభాగాల్లోనూ మెరుగుదల కనిపిస్తోంది. ఒకరు ఒకటికంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటున్నారు’’ అని మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో, ఎండీ ప్రశాంత్‌ త్రిపాఠి తెలిపారు.

మరిన్ని వార్తలు