Deloitte survey: ఉద్యోగుల ధోరణి మారింది, ఈ వస్తువులపై పెట్టే ఖర్చు భారీగా పెరిగింది

25 Sep, 2021 09:27 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వినియోగం పుంజుకుంటోంది. ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావడం క్రమంగా పెరుగుతోంది. దీంతో విచక్షణారహిత అవసరాలు,ఉత్పత్తులపై ఖర్చు పెట్టే ధోరణి పెరుగుతున్నట్టు కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ నిర్వహించిన సర్వేలో తెలిసింది.

‘గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ కన్జ్యూమర్‌ ట్రాకర్‌’ పేరుతో ఈ సంస్థ సర్వే వివరాలతో ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా రెండు విడతల తీవ్రత అనంతరం..సాధారణ వ్యాపార కార్యకలాపాల దిశగా భారత్‌ అడుగులు వేస్తోందని పేర్కొంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, టీకాలను పెద్ద ఎత్తున వేస్తుండడం భారతీయుల్లో కొత్త విశ్వాసాన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. కార్యాలయాలకు తిరిగి రావడం భద్రంగానే భావిస్తున్నారని..ప్రయాణాలపై వెచ్చించేందుకు,విచక్షణారహిత ఉత్పత్తులపై మరింత ఖర్చు చేసేందుకు వారు సముఖంగా ఉన్నారని వివరించింది. 

వ్యక్తిగత కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారతీయులు సహజంగా సంకోచించరని..ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సానుకూల ధోరణులుగా పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు పూర్తిగా సడలించడం వినియోగ దారుల్లో సానుకూల సెంటిమెంట్‌కు దారితీసినట్టు వివరించింది. కార్యాలయాలకు వెళ్లాల్సివస్తే, జాగ్రత్తలు తీసుకునే ధోరణి ఉద్యోగుల్లో ఉన్నట్టు తెలిపింది. 

ఖర్చు వీటి కోసమే..  

మద్యంపై 12 శాతం ఖర్చు చేస్తున్నారు.

కేబుల్‌ టీవీ కోసం 36 శాతం, వస్త్రాలు, పాదరక్షల కోసం 36 శాతం

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కోసం 33 శాతం  

అలాగే, ఫర్నిషింగ్‌ ఉత్పత్తుల కోసం 25 శాతం

రెస్టారెంట్ల కోసం 22 శాతం  
  
68 శాతం మంది స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.
 
74 శాతం మంది బలమైన బ్రాండ్లను ఎంపిక చేసుకుంటున్నారు.

చదవండి: ‘మెదడు మొద్దుబారిపోతోంది.. ఆఫీసులకే వస్తం’

మరిన్ని వార్తలు