ఎగుమతులు 48.34% అప్‌

16 Jul, 2021 05:14 IST|Sakshi

జూన్‌లో 32.5 బిలియన్‌ డాలర్లు ∙98% పెరిగిన దిగుమతులు

న్యూఢిల్లీ: ఏడు నెలల వరుస పురోగతిని కొనసాగిస్తూ, భారత్‌ ఎగుమతులు జూన్‌లో 48.34 శాతం పెరిగి 32.50 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు ఇదే నెల్లో 98 శాతం ఎగసి 41.87 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 9.37 బిలియన్‌ డాలర్లకు చేరింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం వెలువరించిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే..
► పెట్రోలియం పొడక్టులు, రత్నాలు–ఆభరణాలు, రసాయనాలు, తోలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జూన్‌లో గణనీయంగా పెరిగాయి.  
► దిగుమతుల్లో ఒక్క చమురును చూస్తే, ఈ విలువ 10.68 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2020 జూన్‌తో పోల్చితే (4.93 బిలియన్‌ డాలర్లు) ఇది 116.51 శాతం అధికం.  
► పసిడి దిగుమతులు 60 శాతం పెరిగి 970 మిలియన్‌ డాలర్లకు చేరాయి.  

మొదటి త్రైమాసికంలో ఇలా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్‌–జూన్‌ మధ్య ఎగుమతుల విలువ 86 శాతం పెరిగి 95.39 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. దిగుమతులు 126.15 బిలియన్‌ డాలర్లకు (గత ఏడాది ఇదే కాలంలో 60.44 బిలియన్‌ డాలర్లు)ఎగసింది. వెరసి వాణిజ్యలోటు 30.75 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక ఒక్క చమురు దిగుమతులు సమీక్షా కాలంలో 13 బిలియన్‌ డాలర్ల (2020 ఏప్రిల్‌–జూన్‌) నుంచి 31 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి.

మరిన్ని వార్తలు