దేశంలో ఫ‌స్ట్ ఏసీ రైల్వే ట‌ర్మిన‌ల్

14 Mar, 2021 17:43 IST|Sakshi

బెంగళూరు రైల్వే టెర్మినల్ ను దేశంలోనే తొలిసారిగా సెంట్రలైజ్డ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌, తదితర అధునాతన సదుపాయాలతో నిర్మించారు‌. దీనికి ప్రఖ్యాత ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరును పెట్టారు. దేశంలోనే మొట్ట‌మొద‌టి ఏసీ ట‌ర్మిన‌ల్‌ నిర్మాణానికి రూ.314 కోట్ల ఖర్చు అయ్యింది. ఈ నెలాఖ‌రులో ప్రారంభించ‌డానికి ఏసీ రైల్వే ట‌ర్మిన‌ల్ స‌ర్వం సిద్ధ‌మైంది. "భార‌త ర‌త్న మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య పేరుతో బెంగ‌ళూరులో నిర్మించిన తొలి ఏసీ రైల్వే ట‌ర్మిన‌ల్ త్వ‌ర‌లో ప్ర‌జ‌ల‌కు వినియోగంలోకి రానున్న‌ద‌ని" రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ట్వీట్ చేశారు.

బెంగ‌ళూరుతో అనుసంధానానికి మ‌రిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని డిమాండ్లు వ‌స్తున్న నేప‌థ్యంలో బ‌య‌ప్ప‌న‌హ‌ల్లిలో న్యూ కోచ్ ట‌ర్మిన‌ల్ నిర్మాణానికి 2015-16లో ప్ర‌ణాళిక సిద్ధం చేశామ‌ని సౌత్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చెప్పారు. భారతదేశంలో మొట్ట మొదటి ఈ సెంట్రలైజ్డ్‌ ఎయిర్‌ కండిషన్డ్ రైల్వే టెర్మినల్ ను బెంగళూరు విమానాశ్రయం తరహాలో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు 50 రైళ్లను నడపనున్నారు. 4,200 చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ట‌ర్మిన‌ల్ రోజు 50 వేల మంది వరకు స్టేష‌న్‌ను సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. టెర్మినల్‌లోఏడు ప్లాట్‌ఫారమ్‌లు, 3 పిట్ లైన్లు ఉన్నాయి.ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం రెండు స‌బ్‌వేలు, ఒక ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జి, ఎస్క‌లేట‌ర్లు, వీఐపీ లాంజ్‌, ఫుడ్ కోర్టు, అప్ప‌ర్ క్లాస్ వెయిటింగ్ హాలు, రియ‌ల్ టైం ప్యాసింజ‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్టం త‌దిత‌ర వ‌స‌తులు క‌ల్పించిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు.

చదవండి:

కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్!

ఆన్‏లైన్ లో నకిలీ వస్తువులు అమ్మితే ఇక అంతే!

మరిన్ని వార్తలు