ఆ రెండు నగరాల మధ్య.. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవే!

15 Mar, 2022 15:38 IST|Sakshi

ఇకపై భవిష్యత్తు రవాణా మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే. ప్రస్తుతం, పెరుగుతున్న ఇందన ధరల వల్ల పెట్రోల్, డీజిల్ వాహనాలకు గుడ్ బై చెప్పేందుకు వాహనదారులు సిద్దం అవుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ తరహాలో దేశంలో మొట్టమొదటిసారిగా హైవేలో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ టెక్నాలజీని ప్రవేశ పెట్టాలని చూస్తుంది. అంటే, ఈ హైవేలో వెళ్లే అన్ని వాహనాలు విద్యుత్ ద్వారా నడుస్తాయి. రైళ్లు, మెట్రో రైళ్లు ఎలా అయితే కరెంటుతో నడుస్తున్నాయో అలానే ఈ హైవే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పరుగులు పెట్టనున్నాయి. 

రెండేళ్ల క్రితమే ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని జర్మనీలో మొట్టమొదటిసారిగా నిర్మించారు. తద్వారా హైవేపై వెళ్లే క్రమంలో వాహన ట్రక్కులు అప్పటికప్పుడే రీచార్జ్ అవుతాయి. ఇప్పుడు విదేశీ తరహాలో దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ జైపూర్ నగరాల మధ్య ఈ ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇది తన కలల ప్రాజెక్టుగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే ఈ బిగ్ డీల్కు సంబంధించి విదేశీ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. చర్చలు ముగిసిన వెంటనే ఈ రెండు నగరాల మధ్య ఎలక్ట్రిక్ హైవే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని గడ్కరీ తెలిపారు.

ఒక కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగిస్తూ.. మణిపూర్, సీక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లలో రోప్ వే కేబుల్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఇప్పటివరకు 47 ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. "ఢిల్లీ & జైపూర్ నగరాల మధ్య ఎలక్ట్రిక్ హైవేను తయారు చేయాలనేది నా కల" అని ఆయన అన్నారు. 2022-23 బడ్జెట్ పద్దులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు రూ.1.99 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వేల అభివృద్ధి చేపట్టే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)కు రూ.1.34 లక్షల కోట్లు కేటాయించనున్నారు.

(చదవండి: మైలేజ్‌లో రారాజు..మారుతి సుజుకీ సరికొత్త రికార్డు..!)

మరిన్ని వార్తలు