న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన పరికరాలతో ఐఐటీ మద్రాస్లో ఏర్పాటు చేసిన ట్రయల్ నెట్వర్క్ ద్వారా తొలి 5జీ వీడియో కాల్ చేసినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘ఆత్మనిర్భర్ 5జీ. ఐఐటీ మద్రాస్లో 5జీ కాల్ను విజయవంతంగా పరీక్షించాం. ఈ నెట్వర్క్ పూర్తిగా భారత్లోనే అభివృద్ధి చేశారు‘ అని గురువారం కాల్ అనంతరం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దేశీయంగా 4జీ, 5జీ టెక్నాలజీలో పూర్తి సామర్థ్యాలు సాధించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష దీనితో సాకారమైనట్లయిందని మంత్రి పేర్కొన్నారు. 5జీ టెక్నాలజీ సొల్యూషన్స్ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఉపయోగపడే టెస్ట్బెడ్ను ఐఐటీ మద్రాస్లో ప్రధాని మంగళవారమే ఆవిష్కరించారు. ప్రస్తుతం టెలికం కంపెనీలు ప్రయోగాత్మకంగానే 5జీ సేవలను పరీక్షిస్తున్నాయి. ఇవి ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్లలో అందుబాటులోకి రాగలవన్న అంచనాలు ఉన్నాయి.
Aatmanirbhar 5G 🇮🇳
Successfully tested 5G call at IIT Madras. Entire end to end network is designed and developed in India. pic.twitter.com/FGdzkD4LN0
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 19, 2022