కీలక నిర్ణయం తీసుకున్న ఏషియన్‌ కంట్రీ.. వంట నూనె ధరలు తగ్గేనా?

19 May, 2022 16:42 IST|Sakshi

అదీఇదీ అని తేడా లేదు. సబ్బు బిళ్ల నుంచి బస్సు ఛార్జీల వరకు ఒకటా రెండా మూడా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో వస్తువు ధర పెరిగిందన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వంట నూనెల ధర కాస్త తగ్గవచ్చనే ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి.

ఎగుమతులపై నిషేధం
ప్రపంచంలోనే పామాయిల్‌ ఎగుమతుల్లో ఇండోనేషియా దేశం నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. అయితే దేశీయంగా పామాయిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పామాయిల్‌ ఎగుమతులను నిషేధిస్తున్నట్టు 2022 ఏప్రిల్‌ 28న అక్కడి ప్రభుత్వం ‍ప్రకటించింది. ఇండోనేషియా నుంచి పామాయిల సరఫరా ఆగిపోతుందనే వార్తలతో వంట నూనె ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి.

మే 23 నుంచి
గత మూడు వారాలుగా పామాయిల్‌ ఎగుమతులపై నిషేధం కారణంగా ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు ఇండోనేషియా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 2022 మే 23 నుంచి తిరిగి ఎగుమతులకు అవకాశం ఇస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో మే 19న ప్రకటించారు. 

ధర తగ్గడంతో
నిషేధం విధించేప్పుడు టోకు మార్కెట్‌లో లీటరు పామాయిల్‌ ధర 19,800 రూపయల దగ్గర ఉంది. నిషేధం కారణంగా ఆక్కడ పామాయిల్‌ ధర దిగివచ్చి ప్రస్తుతం 17 వేల రూపాయల దగ్గర ట్రేడవుతోంది. అయితే ఆ దేశం పెట్టుకున్న టార్గెట్‌ మాత్రం లీటరు పామాయిల్‌ 14 వేల రూపాలయకు దిగిరావాలని, అయితే దేశీయంగా పామాయిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉండటంతో పాటు స్థానిక వాణిజ్య రంగాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎగుమతులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

ధర తగ్గేనా?
ఇండోనేషియా నుంచి పామాయిల్‌ ఎగుమతులకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో దేశీయంగా కుకింగ్‌ ఆయిల్‌ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇండోనేషియా నుంచి భారత్‌ భారీ ఎత్తున పామాయిల్‌ దిగుమతి చేసుకుంటుంది. ఇండోనేషియా నిషేధాన్ని సాకుగా చూపుతూ మిగిలిన అన్ని వంటి నూనెల ధరలు పెంచాయి వ్యాపార వర్గాలు. కానీ త్వరలో పామాయిల్‌ దిగుమతి అవడం వల్ల డిమాండ్‌ మీద ఒత్తిడి తగ్గి ధరలు అదుపలోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది.

చదవండి: ‘పామాయిల్‌’ సెగ తగ్గేదెలా!

మరిన్ని వార్తలు