పారిశ్రామిక స్థలాలకు డిమాండ్‌.. సీబీఆర్‌ఈ నివేదిక

4 Oct, 2021 00:26 IST|Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ రంగాల ఆఫీస్‌ స్థలాల లీజింగ్‌ కార్యకలాపాలు ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి–జూన్‌) మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ధోరణి కనిపించింది. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది ద్వితీయార్థంతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో లీజింగ్‌ కార్యకలాపాలు 13 శాతం పెరిగి 14 మిలియన్‌ చ.అ.లకు చేరినట్లు నివేదిక పేర్కొంది.

2020 ద్వితీయార్థంలో ఇది 11 మిలియన్‌ చ.అ.లుగా నమోదైంది. సరఫరాలో అంతరాయాలను అధిగమించే దిశగా తమ వినియోగదారులకు చేరువలో ఉండే ప్రాంతాలను ఎంచుకునేందుకే లాజిస్టిక్స్‌ సంస్థలు మొగ్గు చూపుతున్నాయని నివేదిక వివరించింది. కొన్ని సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను కూడా ఎంచుకుంటున్నాయని పేర్కొంది. ఢిల్లీ–దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌), బెంగళూరులో అత్యధికంగా (50 శాతం) లీజింగ్‌ కార్యకలాపాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో అర్ధ సంవత్సర ప్రాతిపదికన అద్దెలు 2 శాతం నుంచి 14 శాతం దాకా పెరిగాయి.

>
మరిన్ని వార్తలు