పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్‌లో రయ్‌!

11 Jun, 2022 06:25 IST|Sakshi

సూచీ 7.1 శాతంగా నమోదు

ఎనిమిది నెలల గరిష్ట స్థాయి

విద్యుత్, మైనింగ్‌ చక్కటి పనితీరు  

న్యూఢిల్లీ: భారత్‌ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 7.1 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఏప్రిల్‌ నెలతో పోల్చితే తాజా సమీక్షా నెల్లో ఉత్పత్తి 7.1 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టులో 13 శాతం పెరుగుదల తర్వాత) ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. విద్యుత్, మైనింగ్‌ రంగాలు మంచి ఫలితాలను అందించినట్లు శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన లెక్కలు వెల్లడించాయి. కొన్ని ముఖ్య విభాగాలను పరిశీలిస్తే...

► తయారీ: ఐఐపీలో దాదాపు 70 శాతం వెయిటేజ్‌ ఉన్న ఈ విభాగంలో 6.3 శాతం పురోగతి నమోదయ్యింది.  
► విద్యుత్‌: ఈ రంగం 11.8 % వృద్ధి సాధించింది.
► మైనింగ్‌: మైనింగ్‌లో 7.8% వృద్ధి నమోదయ్యింది.
► క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ పెట్టుబడులు, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ విభాగంలో భారీగా 14.7% వృద్ధి నమోదుకావడం హర్షణీయం.  
► కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేట్లర్ల వంటి దీర్ఘకాల వినియోగ వస్తువులకు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి 8.5 శాతంగా ఉంది.
► నాన్‌–కన్జూమర్‌ గూడ్స్‌: ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ)కి సంబంధించిన నాన్‌–కన్జూమర్‌ గూడ్స్‌ విభాగంలో స్వల్పంగా 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది.  
► ప్రైమరీ గూడ్స్, ఇంటర్మీడియట్‌ గూడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (నిర్మాణ) గూడ్స్‌ ఉత్పత్తి వృద్ధి రేట్లు వరుసగా 10.1 శాతం, 7.6 శాతం, 3.8 శాతాలుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు