ఉక్రెయిన్‌-రష్యా ఎఫెక్ట్.. ఇక వాటి ధరలు కూడా పెరగనున్నాయా?

9 Mar, 2022 21:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ - రష్యా మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో వివిధ దేశాల ద్రవ్యోల్బణం రోజు రోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ దాడులతో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్రతి సరుకు ధర ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి వస్తువు ధర పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫ్యాన్స్, వాటర్ హీటర్లు, పంపులు, కుట్టు యంత్రాలు వంటగది ఉపకరణాలను తయారు చేసే ఉషా ఇంటర్నేషనల్ కంపెనీ ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల గత 15 నెలల్లో వివిధ ఉత్పత్తుల ధరలు 15% నుంచి 20% పెరిగినట్లు తెలిపింది. 

"ప్రస్తుతం, ఐరోపాలో పరిస్థితి చాలా అస్థిరంగా ఉంది కాబట్టి, ఖర్చు పెరుగుదల మళ్ళీ పెద్ద సవాలు ఉంది" అని ఉషా ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రోహిత్ మాథుర్ అన్నారు. ప్రత్యక్ష కమోడిటీ ధరల ద్రవ్యోల్బణం & ఇంధన ఖర్చుల పరోక్ష ప్రభావం కారణంగా ఉషా ఇంటర్నేషనల్ ఉత్పత్తుల ధరలు మరోసారి 10-12 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తోంది అని ఆయన అన్నారు. 

"ఈ సమస్య ముడి చమురు ధరల కారణంగా వస్తుంది. ఇప్పుడు బ్యారెల్ బ్రెంట్ ఆయిల్ ధర 130 డాలర్లు దాటింది. దేశంలో ఇంధన ధరలు పెరిగితే అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఇది రవాణా రంగా ఖర్చులను పెంచుతుంది" అని ఆయన అన్నారు. అల్యూమినియం, స్టీల్, రాగి & అధిక సాంద్రత కలిగిన పాలిథిలిన్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు 44.2%, 25.4%, 14.6% & 8.3% 2022 నాల్గవ త్రైమాసికంలో పెరిగాయి అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు తెలిపారు. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ముడి చమురు ధరల పెరుగుదల, ఇతర సరుకుల ద్రవ్యోల్బణానికి దారితీసాయి అని వారు తెలిపారు. 

(చదవండి: ఆపిల్ తయారీ కంపెనీతో జట్టు కట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ..!)

మరిన్ని వార్తలు