ఇన్ఫో ఎడ్జ్‌ క్విప్‌ షురూ- షేరు జూమ్

5 Aug, 2020 13:54 IST|Sakshi

క్విప్‌ ధర ఒక్కో షేరుకి రూ.  3177

రూ. 1,875 కోట్ల సమీకరణ లక్ష్యం

7 శాతం జంప్‌చేసిన ఇన్ఫో ఎడ్జ్‌ షేరు

తొలుత రూ. 3420 వద్ద సరికొత్త గరిష్టం

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేరు డీలా- క్యూ1 ఎఫెక్ట్‌

ఇంటర్నెట్ ఫ్రాంచైజీ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌) ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. ఇందుకు ఫ్లోర్‌ ధరగా ఒక్కో షేరుకి రూ. 3177.18ను కంపెనీ బోర్డు మంగళవారం ప్రకటించింది. కాగా.. ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా రూ. 1,875 కోట్ల సమీకరణకు జూన్‌ 22న జరిగిన సమావేశంలోనే ఇన్ఫో ఎడ్జ్‌ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ బాటలో మంగళవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు.. తాజాగా క్విప్‌ ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 1,875 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్‌ విభాగాలు.. నౌకరీ.కామ్‌, 99ఏకర్స్‌.కామ్‌, జీవన్‌సాథీ.కామ్‌, శిక్షా.కామ్‌ను కంపెనీ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇన్ఫోఎడ్జ్‌ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 3420ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 6.6 శాతం జంప్‌చేసి రూ. 3395 వద్ద ట్రేడవుతోంది.

గోద్రెజ్‌ ప్రాపర్టీస్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో రియల్టీ కంపెనీ గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ రూ. 20.2 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2019-20) క్యూ1లో రూ. 90 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 89 శాతం పడిపోయి రూ. 72 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.7 శాతం క్షీణించి రూ.  906 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 892 వరకూ పతనమైంది. 

మరిన్ని వార్తలు