ప్రత్యర్థులకు భిన్నంగా ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం, ఉద్యోగులకు పండగ!

21 Oct, 2022 14:04 IST|Sakshi

సాక్షి, ముంబై: మూన్‌లైటింగ్‌  వివాదం ప్రకంపనలు పుట్టిస్తున్నతరుణంలో ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులు గిగ్ ఉద్యోగాలు చేసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని నిబంధనలు విధించింది.ప్రత్యర్థి కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఉద్యోగులకు  చక్కటి వెసులుబాటుతోపాటు,  కంపెనీలకు తలనొప్పిగా మారిన అట్రిషన్‌ రేటు కూడా తగ్గుతుందని శ్లేషకులు భావిస్తున్నారు.

గురువారం ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో ఇన్ఫోసిస్‌ వివరాలను అందించింది. మూన్‌లైటింగ్‌ని ప్రస్తావించకపోయినప్పటికీ, గిగ్ వర్క్‌ని చేపట్టాలనుకునే వారు, మేనేజర్, హెచ్‌ఆర్‌ ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. అయితే రెండో ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లోనూ, తమకు పోటీగా ఉండకూడదని స్పష్టం చేసింది. తమ కంపెనీ క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ‘గిగ్‌ వర్క్‌’లను ఏ విధంగా చేసుకోవచ్చో ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు అంతర్గతంగా వివరించింది. కంపెనీతో సమర్థవంతంగా పని చేసే వారి సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేయకుండా చూసేందుకు తమ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది.
 

మరిన్ని వార్తలు