రవాణా ఇన్‌ఫ్రాపై వ్యయాలతో 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ

22 Mar, 2023 17:52 IST|Sakshi

న్యూఢిల్లీ: రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు భారత్‌ భారీగా వెచ్చించనుండటమనేది.. 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించాలన్న లక్ష్య సాధనకు అవసరమైన తోడ్పాటు అందించగలదని ది ఎకానమిస్ట్‌ పత్రిక పేర్కొంది. ఈ దిశగా భారత్‌ ఇటీవలి బడ్జెట్‌లో అసాధారణ స్థాయిలో కేటాయింపులు జరిపిందని తెలిపింది. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఏకంగా 1.7 శాతాన్ని రవాణా మౌలిక సదుపాయాలపై వెచ్చించనుందని, ఇది అమెరికా.. అలాగే పలు యూరోపియన్‌ దేశాలతో పోలిస్తే రెట్టింపని ది ఎకానమిస్ట్‌ తాజా సంచికలో వివరించింది. 

(ఇదీ చదవండి: ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్‌ ఆగ్రహం)

అంతర్జాతీయంగా మందగమన ఛాయలు నెలకొన్న తరుణాన దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పనకు ఊత మిచ్చేలా మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టాలని వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కేంద్రం నిర్దేశించు కుంది. అధికారిక డేటా ప్రకారం రైల్వేలకు రూ. 2.4 లక్షల కోట్లు కేటాయించింది. 2013-14తో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు అధికం. ట్రాక్‌ల నిర్మాణం, కొత్త కోచ్‌లు, విద్యుదీకరణ తదితర అంశాలపై ఈ నిధులు వినియోగించ నున్నారు. అలాగే రహదారుల నిర్మాణానికి కేటాయింపులు 36 శాతం పెరిగి రూ. 2.7 లక్,ల కోట్లకు చేరాయి.

ఇక అదనంగా 50 విమానాశ్రయాలు, హెలీపోర్టులు మొదలైన వాటిని పునరు ద్ధరించడంపైనా దృష్టి పెట్టింది. బొగ్గు, ఉక్కు, ఎరువులు తదితర రంగాల సంస్థలకు ప్రారంభం నుంచి చివరి వరకూ కనెక్టివిటీని మెరుగుపర్చడం కోసం 100 కీలకమైన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్రం గుర్తించింది. వాటిపై రూ. 75,000 కోట్లు వెచ్చించనుంది. ఇలా అసాధారణ స్థాయిలో మౌలికసదుపాయాలపై వెచ్చిస్తుండటమనేది ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్లుగా (ట్రిలియన్‌) ఉన్న భారత ఎకానమీ 2025-26 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఎదిగేందుకు సహాయపడగలదని ది ఎకానమిస్టు వివరించింది.

మరిన్ని వార్తలు