-

భారీగా పెరిగిన ఇన్‌స్టంట్‌ నూడిల్స్‌ ధరలు, 14 ఏళ్ల తర్వాత..తొలిసారి!

26 Aug, 2022 21:05 IST|Sakshi

థాయిలాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14ఏళ్ల తర్వాత ఇన్‌స్టంట్‌ నూడిల్స్‌ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్‌స్టంట్ నూడుల్స్ ధరలను పెంచే ప్రతిపాదనకు థాయ్‌లాండ్ ఆమోదం తెలిపిందని ఆ దేశ వాణిజ్య విభాగం వెల్లడించింది. పెరిగిన ధరలు ఆగస్ట్‌ 25 (నిన్న)నుంచి అమల్లోకి వచ్చాయి. 

2008లో చివరి సారిగా థాయిల్‌ లాండ్‌ ప్రభుత్వం ఇన్‌స్టంట్‌ నూడిల్స్‌ ధరల్ని పెంచింది. అయితే కొద్ది రోజుల క్రితం.. ఉక్రెయిన్‌పై రష్యా వార్‌, గత సంవత్సరాల్లో సంభవించిన కరువు, వరదలతో పాటు గోధుమలు, ఇంధనం, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయని ఇన్‌ స్టంట్‌ నూడుల్స్ ఐదు ప్రధాన ఉత్పత్తిదారులు తమ ధరలను పెంచడానికి అనుమతించాలని థాయ్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో తాజాగా ఉత్పత్తి దారులు విజ్ఞప్తితో థాయ్‌ ప్రభుత్వం ధరల పెంపుపై మద్దతు పలికింది. 

దీంతో ప్రతి సాధారణ పరిమాణ ప్యాకెట్‌పై ఏడు భాట్‌ల (అంటే భారత్‌ కరెన్సీలో రూ.15.48) పెంచుతూ వాణిజ్య విభాగం ఆమోదం తెలిపింది. ఇన్‌స్టంట్ నూడుల్స్ ధరలను బ్యాంకాక్ ఇప్పటివరకు ఒక్కో ప్యాకెట్‌కి ఆరు భాట్ (రూ.13.27కి) పరిమితం చేసింది.

ఇటీవలి వారాల్లో, గోధుమ పిండి ధర దాదాపు 20-30 శాతం పెరిగింది. పామాయిల్ ధర రెండింతలు పెరిగిందని థాయ్ ప్రభుత్వ ప్రిజర్వ్డ్ ఫుడ్ విభాగానికి చెందిన వీర నాఫప్రుక్‌చార్ట్ చెప్పారు.
 
జూన్‌లో థాయ్‌లాండ్‌లో ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిందని, వినియోగదారులపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని నిత్యావసర వస్తువులపై ధరల నియంత్రించాలంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర ఆసియా దేశాలలో నూడిల్స్‌ ధరలు ఇప్పటికే పెరిగాయి. చైనాలో ఈ సంవత్సరం గోధుమ ధర 30 శాతం పెరగవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి.

మరిన్ని వార్తలు