ipo: ఐపీవోలకు ‘బీమా’ సంస్థల క్యూ

7 Oct, 2021 09:23 IST|Sakshi

ముంబై: ఇప్పటికే కిక్కిరిసిపోయిన పబ్లిక్‌ ఇష్యూల మార్కెట్‌లో కొత్తగా బీమా రంగానికి సంబంధించిన మరో మూడు సంస్థలు ఐపీవోకి సిద్ధమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి రూ. 10,000 కోట్లు పైగా సమీకరించనున్నాయి. ఇన్సూరెన్స్‌ బ్రోకరేజి సంస్థ పాలసీబజార్‌ని నిర్వహించే పీబీ ఫిన్‌టెక్, ఆరోగ్య బీమా సంస్థ స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ మెడి అసిస్ట్‌ హెల్త్‌కేర్‌ సర్వీస్‌ ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేశాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 40 పైగా కంపెనీలు ఐపీవోకి రాగా .. సుమారు రూ. 70,000 కోట్ల పైగా నిధులు సమీకరించాయి. ఆగస్టులో ఇప్పటిదాకా 24 పైగా సంస్థలు ఐపీవోకి సంబంధించి పత్రాలు దాఖలు చేశాయి. ఈ ఏడాదిలో ఏకంగా 100 పైగా పబ్లిక్‌ ఇష్యూలు రాగలవని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. 

రెండో భారీ ఇష్యూగా పీబీ ఫిన్‌టెక్‌.. 
పీబీ ఫిన్‌టెక్‌ సుమారు రూ. 6,017 కోట్లు సమీకరించనుంది. టైగర్‌ గ్లోబల్, టెన్సెంట్‌ హోల్డింగ్స్‌ వంటి దిగ్గజాలు ఇందులో ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ ఏడాదిలో జొమాటో తర్వాత పీబీ ఫిన్‌టెక్‌ది రెండో అతి భారీ ఇష్యూ కానుంది. జొమాటో రూ. 9,375 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు స్టాండెలోన్‌ ప్రైవేట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ అయిన స్టార్‌ హెల్త్‌ దాదాపు రూ. 3,000 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉంది. అటు దేశీయంగా అతి పెద్ద థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న మెడి అసిస్ట్‌ సుమారు రూ. 840–1,000 కోట్ల నిధులను ఐపీవో ద్వారా సమీకరించనున్నట్లు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ల (డీఆర్‌హెచ్‌పీ) ద్వారా తెలుస్తోంది. పీబీ ఫిన్‌టెక్‌ ఆగస్టు 4న, స్టార్‌ హెల్త్‌ జులై 28న, మెడి అసిస్ట్‌ మే 11న సెబీకి డీఆర్‌హెచ్‌పీలు సమర్పించాయి.  

ఒక్కో ఇష్యూ ఇలా.. 
దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో స్టార్‌ హెల్త్‌ అతి పెద్ద స్టాండెలోన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంస్థగా ఉంది. దీనికి సుమారు 15.8 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ గురు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాతో పాటు వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ వంటి దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్‌ చేశాయి. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూ. 2,000 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా,  వాటాదారులు 6 కోట్ల పైచిలుకు షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో విక్రయించనున్నారు. సేఫ్‌క్రాప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఇండియా 3.06 కోట్ల షేర్లు, ఎపిస్‌ గ్రోత్‌ 76 లక్షల షేర్లు విక్రయించనున్నాయి. మరోవైపు, పాలసీబజార్, ఆన్‌లైన్‌ రుణాల ప్లాట్‌ఫాం పైసాబజార్‌లను పీబీ ఫిన్‌టెక్‌ నిర్వహిస్తోంది. పరిమాణంపరంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పాలసీ విక్రయాలకు సంబంధించి పాలసీబజార్‌కు 93.4 శాతం మార్కెట్‌ వాటా ఉంది. 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిజిటల్‌ ఇన్సూరెన్స్‌ విక్రయాల పరిమాణంలో సుమారు 65.3 శాతం లావాదేవీలు దీని ద్వారానే జరిగాయి. పాలసీబజార్‌ కొత్తగా రూ. 3,750 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రస్తుత వాటాదారులు సుమా రు రూ. 2,267 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.  

ఇక మెడిఅసిస్ట్‌ విషయం తీసుకుంటే.. ఆదాయాలు, ప్రీమియం వసూళ్ల సేవలు తదితర అంశాలపరంగా దేశంలోనే అతిపెద్ద థర్డ్‌–పార్టీ ఇన్సూరెన్స్‌ అడ్మినిస్ట్రేటరుగా కార్యకలాపాలు సాగిస్తోంది. దేశవ్యాప్తంగా 722 నగరాలు, పట్టణాల్లో 11,000 పైచిలుకు ఆస్పత్రులతో భారీ నెట్‌వర్క్‌ ఉంది. అపోలో హాస్పిటల్స్‌ మణిపాల్‌ హాస్పిటల్, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్, నారాయణ హృదయాలయ, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ వంటి పేరొందిన హాస్పిటల్‌ చెయిన్లకు థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటరుగా (టీపీఏ) వ్యవహరిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూకి సంబంధించి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో విక్రమ్‌జిత్‌ సింగ్‌ చత్వాల్, మెడిమ్యాటర్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్, బెస్సీమర్‌ హెల్త్‌ క్యాపిటల్, ఇన్వెస్ట్‌కార్ప్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ 1 మొదలైన ఇన్వెస్టర్లు 25,39,092 షేర్లను విక్రయిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు