Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? 

29 Mar, 2023 09:02 IST|Sakshi

ఏప్రిల్ 1 నుంచి పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్‌ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే అదనపు చార్జీలు ఉంటాయని, ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)  ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో యూజర్లకు చార్జీల మోత తప్పదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు.

ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌.. పేటీఎం వ్యాలెట్‌ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు 

ఆన్‌లైన్ వాలెట్‌లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఇంటర్‌చేంజ్ రుసుము విధించేందుకు ఎన్‌పీసీఐ ప్రతిపాదనలు చేసిన విషయం నిజమే. అయితే ఈ చార్జీలు యూజర్లకు వర్తించవు. 

ఇంటర్‌చేంజ్ రుసుము అనేది వ్యాలెట్ జారీ చేసే బ్యాంకులు లావాదేవీలను అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్‌ చేయడం వంటి వాటి కోసం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి పేమెంట్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు చెల్లించాల్సిన రుసుము. బ్యాంక్, ప్రీపెయిడ్ వాలెట్ మధ్య వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు లేదా వ్యక్తి నుంచి వ్యాపారి లావాదేవీలకు ఈ ఇంటర్‌చేంజ్ రుసుము వర్తించదు. అంటే యూపీఐ చెల్లింపులు చేసే యూజర్లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్‌బీఐపై కాగ్‌ రిపోర్ట్‌

పీపీఐ ద్వారా చేసిన రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్‌చేంజ్ ఫీజు ఉంటుంది. ఆపై వాలెట్ లోడింగ్ ఛార్జీలు ఉంటాయి. కాబట్టి పేటీఎం లేదా ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లను జారీ చేసేవారు వాలెట్ లోడింగ్ ఛార్జీలుగా 15 బేసిస్ పాయింట్లను రెమిటర్ బ్యాంక్‌కి చెల్లించాలి. 

మర్చెంట్స్‌ ప్రొఫైల్‌ను బట్టి ఇంటర్‌ఛేంజ్ రుసుము రేట్లు మారుతాయని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.  వివిధ పరిశ్రమలకు ఇంటర్‌ఛేంజ్ రుసుము వేరువేరుగా  ఉంటుంది. లావాదేవీ విలువలో 0.50 శాతం నుంచి 1.10 శాతం వరకు ఛార్జీలు ఉంటాయని ఎన్‌పీసీఐ పేర్కొంది.

మరిన్ని వార్తలు