5జీ వేలంపై టెల్కోల్లో ఆసక్తి

20 Jun, 2022 05:56 IST|Sakshi

కేంద్ర కమ్యూనికేషన్స్‌ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలకు ఉపయోగపడే 5జీ స్పెక్ట్రంపై టెలికం సంస్థలు ఆసక్తిగానే ఉన్నాయని, వేలంలో ఉత్సాహంగా పాల్గొంటాయని కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ధీమా వ్యక్తం చేశారు. 5జీ సర్వీసులతో దేశం ముందుకెళ్లడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. స్పెక్ట్రం బేస్‌ ధరను గణనీయంగా తగ్గించడంతో పాటు, యూసేజీ చార్జీలనూ ఎత్తివేయడంతో టెల్కోలపై ఆర్థిక భారం చాలా మటుకు తగ్గిపోతుందని మంత్రి చెప్పారు.

ఇక టెక్‌ కంపెనీలు సొంతంగా క్యాప్టివ్‌ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రం కేటాయించే విషయంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  టెలికం శాఖ జూలై 26న స్పెక్ట్రం వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేలంలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంను విక్రయించనుంది. దీనికి సంబంధించి జూన్‌ 20న ప్రీ–బిడ్‌ కాన్ఫరెన్స్‌ను టెలికం శాఖ నిర్వహించనుంది. 

మరిన్ని వార్తలు