కేసీఆర్‌ చెప్పినట్టే జరగబోతుందా? ఆ విషయంలో జట్టు కట్టిన యమహా, కవాసాకి

13 Nov, 2021 19:11 IST|Sakshi

భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్‌ వాహనాలు ఉండబోవంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్టే ఫ్యూచర్‌ ఉండబోతుందా ? అంటే అవును అన్నట్టుగానే వెహికల్‌ ఇండస్ట్రీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. టెక్నాలజీ వేగంగా మారుతుందని, త్వరలో రోడ్ల మీద పెట్రోలు , డీజిల్‌ వాహనాలు కనపించవన్నారు. రోడ్లపై కాలుష్యం వెదజల్లని ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ మాత్రమే తిరుగుతాయన్నారు. తాను అటువంటి కారు ఒకటి కొన్నట్టు చెప్పారు. ఆయన మాటలకు నిజం కావడానికి ఎంతో కాలం పట్టేట్టుగా లేదు. ఇంతకాలం పెట్రోలు, డీజిల్‌లను ఉపయోగించే ఇంటర్నల్‌ కంబస్టన్‌ (ఐసీ) ఇంజన్లతో కార్లు, బైకులు, స్కూటర్లు తయారు చేస్తూ వచ్చిన సంస్థలన్నీ త్వరలో వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చాయి. అంతేకాదు కాలుష్య రహిత ఇంజన్లను తయారు చేసేందుకు వీలుగా దశబ్ధాల తరబడి ఉన్న వైరాన్ని మరిచి జట్టు కట్టేందుకు సైతం రెడీ అయ్యాయి.

కలిసికట్టుగా
జపాన్‌లోని ఓకహాలో నవంబరు 13,14 తేదీల్లో ఇంటర్నల్‌ కంబస్టన్‌ (ఐసీ) ఇంజన్ల తయారీ సంస్థ సదస్సులో కీలక ప్రకటన వెలువడింది. ఐసీ ఇంజన్ల తయారీలో మార్కెట్‌ దిగ్గజ కంపెనీలైన కవాసాకి, యమహా, టయోటా, మజ్దా, సబరు కార్పొరేషన్లు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. పరస్పరం సాంకేతిక సహకారం అందించుకుంటూ ఐసీ ఇంజన్ల స్థానంలో హైడ్రోజన్‌ ఇంజన్లు రెడీ చేస్తామంటూ సంయుక్త ప్రకటన జారీ చేశాయి.

హైడ్రోజన్‌ ఇంజన్‌
డీజిల్‌, పెట్రోల్‌లకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌ను ఉపయోగించే టెక్నాలజీ 2018లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు 2010 నుంచే హైడ్రోజన్‌తో వాహనాలు నడిచే ఇంజన్లను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానంపై కవాసాకి ప్రయోగాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ ఇంజన్‌ అందుబాటులోకి తేనుంది. అనంతరం ఆ టెక్నాలజీనికి మిగిలిన కంపెనీలతో మరింత సమర్థంగా మార్చి కమర్షియల్‌ వెహికల్స్‌ మార్కెట్‌లోకి తేవాలని నిర్ణయించారు. ఒక్కసారి ఇంజన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత హోండా, సుజుకిలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తామంటున్నారు.

ఈవీ హవా
ఇండియాలో ఉన్న బైకుల్లో నూటికి తొంభై శాతం జపాన్‌ కంపెనీలు తయారు చేసిన ఐసీ ఇంజన్లతోనే తయారవుతున్నాయి. కాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌ పుంజుకుంటోంది. రోజుకో కొత్త స్టార్టప్‌ కంపెనీ ఈవీ బైకులు, స్కూటర్లతో మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. దీంతో ఐసీ ఇంజన్ల వాహనాల మార్కెట్‌కి కోత పడుతోంది.

రిలయన్స్‌ సైతం
ఇక రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఏకంగా హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ ఉత్పత్తి చేసే రెండు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ముఖేశ్‌తో పాటు అదానీ సైతం ఈ రంగంలో పోటీ పడుతున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ ఇంజన్ల హవా నడవనుంది. ఒకప్పటి స్టీమ్‌ ఇంజన్ల తరహాలోనే పెట్రోలు, డీజిల్‌ ఇంజన్లు మూలన పడే పరిస్థితి ఎదురుకానుంది.

చదవండి:ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. టెస్ట్‌ రైడ్‌కి మీరు సిద్ధమా?

మరిన్ని వార్తలు