iPhone14: స్టీవ్‌ జాబ్స్‌ కుమార్తె సెటైర్‌...ఏమైంది?

8 Sep, 2022 14:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 14 సిరీస్‌ను టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా లాంచ్‌ చేసింది. అయితే లేటెస్ట్‌ ఐఫోన్ 14 ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్‌కు నచ్చినట్టు లేదు. అందుకే సెటైర్‌ వేయడం ఇంటర్నెట్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఊహించని విధంగా మీమ్‌ను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో మీమ్ ఫెస్టివల్ జరుగుతోంది. 

స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆపిల్‌ ఐఫోన్‌, 13, 14ని పోలుస్తూ ఒక స్టోరీ పోస్ట్‌ చేశారు. దీంతో నెటిజన్లు ఫన్నీగా కమెంట్‌ చేస్తున్నారు. ఆపిల్‌ ప్రకటన తరువాత ఐఫోన్‌14ను అప్‌డేట్‌ చేసుకుంటున్నా అని క్యాప్షన్‌తో ఒక​ పోస్ట్‌ పెట్టారు.  ఐఫోన్‌ 13తోపోలిస్తే. కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్‌డేట్‌ ఏమీ లేదంటూ ఐఫోన్‌ లవర్స్‌ పెదవి విరుస్తున్న సందర్భంలో ఈవ్‌ పోస్ట్‌ చర్చకు దారి తీసింది. 

మరోవైపు యుఎస్‌లోని ఐఫోన్ మోడల్స్‌లో ఇ-సిమ్ యాక్టివేషన్‌పై కూడా యూజర్లు అంసతృప్తిగా ఉన్నారు. తాజా అప్‌డేట్స్‌పై సోషల్ మీడియా మీమ్స్‌ ఒక రేంజ్‌లో పేలుతున్నాయి.  "తదుపరి ఐఫోన్‌లో మైక్రోఫోన్ ఉండదు. ఇక మీరు నేరుగా మీరు మాట్లాడాలను కుంటున్న వారి దగ్గరకు  వెళ్లాలి." అని ఒక  యూజర్‌ కమెంట్‌ చేయగా,  "త్వరలో ఇది ఐఫోన్‌కు బదులుగా ఇ-ఫోన్ అవుతుందని  మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే ఈ సిమ్స్‌ ఇండియాకు రాకపోవడం మంచిదైంది. ఐఫోన్ 14 సిరీస్ సిమ్ ట్రేతో ఉండడం గొప్ప విషయం. లేదంటే ఇక్కడ  చాలా గందరగోళ పరిస్థితి ఉండేది. తాము ఇంకా ఇ-సిమ్‌లకు సిద్ధంగా లేం అంటూ ఇండియన్‌  యూజర్‌ ఒకరు రాశారు. 

కాగా బుధవారం రాత్రి నిర్వహించిన "ఫార్ అవుట్" మెగా ఈవెంట్‌లో ఆపిల్‌ ఐఫోన్ 14, ఎయిర్‌పాడ్స్ ప్రో, ఆపిల్ వాచ్ అల్ట్రాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రొ, ఐఫోన్‌ 14 మాక్స్‌ను ఆవిష్కరించింది. ఐఫోన్ 14 ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16 నుండి , ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి  సేల్‌కు అందుబాటులో ఉంటాయి. ఇండియాలో ఐఫోన్‌ 14  ప్రారంభ ధర రూ. 79,900,  ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా ఉంటుంది. 

మరిన్ని వార్తలు