అంతర్జాతీయ సంకేతాలే కీలకం...

21 Sep, 2020 05:32 IST|Sakshi

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు

కరోనా సంబంధిత వార్తలు... మార్కెట్‌పై ప్రభావం చూపుతాయ్‌

ఈ వారమే ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు

అనిశ్చితి, ఒడిదుడుకులు కొనసాగుతాయ్‌ ! 

ప్రధాన  ఆర్థిక గణాంకాలేమీ లేకపోవడంతో ఈ వారం మార్కెట్‌కు అంతర్జాతీయ సంకేతాలే కీలకమని నిపుణులంటున్నారు. వీటితో పాటు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత వార్తలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి... ఈ అంశాలు  కూడా తగినంత ప్రభావం చూపుతాయని వారంటున్నారు. సెప్టెంబర్‌ సిరీస్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులంటున్నారు.  దేశీయంగా ప్రధాన ట్రిగ్గర్లు ఏమీ లేకపోవడంతో అనిశ్చితి కొనసాగుతుందని, అందుకే
ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు.    

ప్రపంచ పీఎమ్‌ఐ గణాంకాలు....
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తక్షణ తాయిలాలేమీ ఇవ్వకపోవడం గత వారం ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ను కూడా దెబ్బతీసింది. సున్నా స్థాయి రేట్లు మరో మూడేళ్ల పాటు కొనసాగుతాయని సంకేతాలిచ్చిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రికవరీపై అనిశ్చితిని వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా, ఇంగ్లాండ్, యూరోజోన్‌ల పీఎమ్‌ఐ(పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) గణాంకాలు ఈ వారం విడుదలవుతాయి.  
ఈ వారం మూడు ఐపీఓలు....
ఈ వారంలో మూడు కంపెనీల ఐపీఓలు వస్తున్నాయి. క్యామ్స్‌(కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌), కెమ్‌కాన్‌ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్‌ బ్రోకింగ్‌ కంపెనీలు తమ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లతో సందడి చేయనున్నాయి.  

విదేశీ పెట్టుబడులు రూ.3,944 కోట్లు  
పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండటంతో ఈ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ.3,944 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో నికర పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లో రూ.1,766 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.2,178 కోట్ల చొప్పున ఉన్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ జోరుగా బాండ్లను కొనుగోలు చేస్తుండటంతో బాండ్ల రాబడులు తక్కువగా ఉండటం, అంతర్జాతీయంగా అధికంగా లభిస్తున్న లిక్విడిటీ... ఈ కారణాల వల్ల మన మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల  పెట్టుబడులు వస్తున్నాయని నిపుణులంటున్నారు. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను సున్సా స్థాయిల్లోనే మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలివ్వడంతో భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతుందని వారంటున్నారు.  

ఐపీఓల సందడి
చాలా రోజుల తర్వాత ఈ నెలలో ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ నెలలో హాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్, రూట్‌ మొబైల్స్‌ తమ ఐపీఓలతో దుమ్ము రేపాయి ఇక ఈ వారం మూడు కంపెనీలు–క్యామ్స్‌(కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌), కెమ్‌కాన్‌ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్‌ బ్రోకింగ్‌ కంపెనీలు  తమ ఐపీఓలతో సందడి చేయనున్నాయి. ఈ ఐపీఓలకు సంబంధించిన తేదీలు, ప్రైస్‌బాండ్, జీఎమ్‌పీ తదితర వివరాలు.....

>
మరిన్ని వార్తలు