కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌పై ఫిర్యాదులు ఎక్కువ: ఆర్‌బీఐ

13 Jan, 2022 07:59 IST|Sakshi

గణాంకాలు విడుదల చేసిన ఆర్‌బీఐ

ముంబై: బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం, డెబిట్‌కార్డులు, మొబైల్‌ బ్యాంకింగ్, నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డులకు సంబంధించి ఎక్కువగా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయిస్తున్నారు. 2020 జూలై నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వీటిపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. పారదర్శక విధానాలు పాటించకపోవడం, ఇచ్చిన హామీలను నిలుపుకోకపోవడంపై ఖాతాదారులు ఫిర్యాదు చేస్తున్నట్టు ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. 2020-21 వార్షిక నివేదికను ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసింది. 2020 జూలై 1 నుంచి 2021 మార్చి 31 వరకు తొమ్మిది నెలల గణాంకాలు ఇందులో ఉన్నాయి. 

2020 జూలై నుంచి ఆర్‌బీఐ సైతం ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా (ఏప్రిల్‌-మార్చి) తన వార్షిక సంవత్సరాన్ని కూడా సవరించుకుంది. బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ 2006 (బీవోఎస్‌), ద అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ ఫర్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీస్‌ 2018(ఓఎస్‌ఎన్‌బీఎఫ్‌సీ), ద అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ ఫర్‌ డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ 2019 (ఓఎస్‌డీటీ) పథకాల కింద గణాంకాలను ఆర్‌బీఐ ఈ నివేదికలో పేర్కొంది.

వీటి నుంచి ఎక్కువ.. 
ఈ మూడు పథకాల కింద ఫిర్యాదులు 2020 జూలై నుంచి 2021 మార్చి మధ్య కాలంలో 22 శాతం పెరిగి 3,03,107కు చేరాయి. మొత్తం ఫిర్యాదుల్లో ఏటీఎం/డెబిట్‌కార్డుల నుంచి 17.40 శాతం, మొబైల్‌/ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలపై 12.98 శాతం, క్రెడిట్‌ కార్డులపై 12.36 శాతం చొప్పన వచ్చాయి. ఓఎస్‌డీటీ పథకం కింద ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌/యూపీఐ/ బీబీపీఎస్‌/ భారత్‌ క్యూఆర్‌కోడ్‌కు సంబంధించి 51 శాతం,, మొబైల్‌/ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి 22.57 శాతం, తప్పుడు బెనిఫీషియరీ కారణంతో లావాదేవీ మొత్తాన్ని తిరిగి జమ చేయకపోవడంపై 8 శాతం చొప్పున ఫిర్యాదులు దాఖలయ్యాయి.

(చదవండి: కేసులు పెరిగితే ఆంక్షలు విధించకండి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి!)

మరిన్ని వార్తలు