IT Raids On Dolo-650 Lab: డోలో-650 కంపెనీపై పెద‍్ద ఎత్తున ఐటీ దాడులు

6 Jul, 2022 18:41 IST|Sakshi

 డోలో-650 తయారీ కంపెనీపై  దేశవ్యాప్తంగా ఐటీ దాడులు

బెంగళూరు: కోవిడ్‌-19సంక్షోభంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన డోలో-650 తయారీ సంస్థ మైక్రో లాబ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆదాయపు పన్ను ఎగవేశారనే ఆరోపణలతో మైక్రో ల్యాబ్స్ కార్యాలయంపై ఐటీ శాఖ బుధవారం పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఏకంగా 200 మంది ఐటీ సిబ్బంది పాల్గనడం హాట్‌  టాపిక్‌గా మారింది.  ఈ సందర్భంగా మాధవనగర్‌లోని రేస్‌కోర్స్‌ రోడ్డులోని మైక్రో ల్యాబ్స్‌ నుంచి అధికారులు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 

న్యూఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవా సహా దేశవ్యాప్తంగా 200 అధికారులు ఏకకాలంలో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి.  గత రెండేళ్లుగా  ఆదాయానికి సంబంధించి పన్నులు ఎగ్గొట్టారనే అనుమానంతో సంస్థ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానాల ఇళ్లల్లో కూడా దాడులు  చేపట్టినట్టు ఐటీ శాఖ. వెల్లడించింది.

కాగా 2020లో కరోనా విజృంభణ కాలంనుంచి డోలో-650 ట్యాబ్లెట్ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. జ్వరాన్ని నియంత్రించే డోలో-650 జనంలోకి విపరీతంగా చొచ్చుకుపోయింది. ఫలితంగా అమ్మకాల్లో రికార్డుల్ని బ్రేక్ చేసింది. 350 కోట్ల టబ్లెట్ల విక్రయాలతోఏడాదిలో 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. 1983లో కుటుంబ వ్యాపారాన్ని స్వీకరించిన సురానా ఫార్మా రంగంలో అనుభవజ్ఞుడు

మరిన్ని వార్తలు