Work From Home: హైదరాబాద్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హోంకు ఎండ్‌కార్డ్‌..! ఐటీ కంపెనీల కీలక నిర్ణయం..!

9 Feb, 2022 13:17 IST|Sakshi

రాష్ట్రంలో కరోనా మూడో దశ పూర్తిగా ముగిసిపోయిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు పూర్తిగా వర్క్‌ ఫ్రమ్‌ హోంను ఎత్తివేసి, ఆఫీసులకు పిలవొచ్చునని ఆయన మంగళవారం రోజున మీడియా సమావేశంలో తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఐటీ కంపెనీలు సిద్దం..!
కోవిడ్-19 మూడో వేవ్‌ ముగిసిందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పేర్కొనడంతో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు పిలిపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు వర్క్-ఫ్రమ్-హోమ్‌ స్ట్రాటజీకి త్వరలోనే ముగింపు పలకవచ్చునని తెలుస్తోంది. ఇక ఆయా కంపెనీలు కూడా పూర్తి స్థాయి కార్యాలయాలను ప్రారంభించేందుకు త్వరలో ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఐటి కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు పిలవాలని భావించగా ఒక్కసారి ఓమిక్రాన్‌ వేరియంట్‌ రాకతో తిరిగి ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోంకే పరిమితమయ్యారు. అయితే రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఇప్పుడు కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతోపాటు తెలంగాణలో కోవిడ్‌ పాజిటీవీటీ రేటు కూడా పడిపోవడంతో చాలా ఐటీ కంపెనీలు తమ మునుపటి నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నాయి.

రాబోయే రెండు వారాల్లో..!
ఐటీ కంపెనీలు రాబోయే రెండు వారాల్లో కార్యాలయాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లలో నష్టపోయిన స్టార్టప్, చిన్న కంపెనీలు స్టాఫ్‌ని వెనక్కి పిలిపించుకోవాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. కాగా, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్ భరణి కె అరోల్ మాట్లాడుతూ...ఐటి కంపెనీలు అన్ని భద్రతా చర్యలతో సురక్షితమైన ప్రదేశాలని అన్నారు.

చదవండి: 47 అంతస్తుల కో లీవింగ్‌ ప్రాజెక్ట్‌.. ఇండియాలోనే అతి పెద్దది.. ఎక్కడంటే?

మరిన్ని వార్తలు