ఆస్ట్రేలియాలో భారత్‌ ఐటీ సంస్థల పన్ను భారంపై దృష్టి

16 Aug, 2022 06:25 IST|Sakshi

వచ్చే నెల్లో కీలక చర్చలు  

న్యూఢిల్లీ: భారత్‌– ఆస్ట్రేలియాల వాణిజ్య మంత్రుల మధ్య వచ్చే నెలలో జరిగే కీలక సమావేశంలో భారతీయ ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న పన్ను సమస్యలను లేవనెత్తనున్నట్లు ఇక్కడ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిజానికి రెండు దేశాలూ  1991లో డబుల్‌ టాక్సేషన్‌ అవాయిడెన్స్‌ అగ్రిమెంట్‌ (డీటీఏఏ)పై సంతకం చేశాయి. 2013లో ఈ ఒప్పందంలో కాలానుగుణ మార్పులూ జరిగాయి.

కాగా, ఆస్ట్రేలియాలో సాంకేతిక సేవలను అందించే భారతీయ సంస్థల ఆఫ్‌షోర్‌ ఆదాయంపై పన్ను విధింపును కూడా డీటీఏఏ కిందకు తీసుకురావాలన్న డిమాండ్‌ ఉంది. ఈ పన్ను విధింపును నిలిపివేయడానికి డీటీఏఏ కింద నిబంధనలను త్వరగా సవరించాలని ఆస్ట్రేలియాను భారత్‌ కోరుతోంది. ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్‌ ఫారెల్‌ సెప్టెంబరు చివర్లో జాయింట్‌ మినిస్టీరియల్‌ కమిషన్‌ సమావేశంలో పాల్గొనడానికిగాను  భారతదేశాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా భారత్‌ డీటీఏఏ నిబంధనల సమస్యను లేవనెత్తుతుందని అధికారి తెలిపారు.               

మరిన్ని వార్తలు